గణేశ్ చతుర్ధి ఉత్సవాలు హైదరాబాద్ నుంచి వికేంద్రీకరణ చెందుతున్నాయి. గత నాలుగైదేళ్ళలో పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్ లో గణపతి నవరాత్రులు నిర్వహించే సంఘాలు బాగా పెరిగిపోతున్నాయి. ఇళ్ళల్లో ఇండివిడ్యువల్స్ చేసే పూజలు అందుకుంటున్న విఘ్నేశ్వరుడు ఇపుడు పందిళ్ళలో, అపార్టుమెంట్లలో, చిన్నచిన్న జంక్షన్లలో కమ్యూనిటీల అర్చనలు అందుకోవడం ఏటేటా విస్తరిస్తోంది.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో వినాయకుడి బొమ్మలు చేసే ఉత్తర ప్రదేశ్ కళాకారులు, కార్మికుల బృందాలు, ఇంతకుముందెన్నడూ లేని విధంగా మూడు నాలుగేళ్ళుగా వినాయక చవితికి మూడునెలల ముందునుంచీ ఆంధ్రప్రదేశ్ చేరుకుని ఆర్డర్లు తీసుకుని విగ్రహాలు చేసి అమ్ముతున్నారు. ఎపిలో ఈ ఏడాది తమ బృందాలు ఈ ఏడాది దాదాపు 80 కేంద్రాల్లో పనిచేస్తున్నాయని వేమగిరివద్ద గుడారం వేసుకుని వినాయక విగ్రహాలు తయారు చేస్తున్న బృందంలో ఒక కళాకారుడు చెప్పాడు.
హోల్ సేల్, రీటెయిల్ పూల మార్కెట్లు వున్న కడియపులంక నుంచి గళపతి నవరాత్రులకు రెండు కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. ”పందిరి వేశారంటే పదివేలు, అపార్టుమెంట్లలో అయితే సైజునిబట్టి రెండు నుంచి ఐదువేల రూపాయల పూలు కొంటున్నారని పూలు వ్యాపారులు చెబుతున్నారు. ఈ మార్కెట్ నుంచి గోదావరిజిల్లాలకు విశాఖజిల్లాలో సగం భాగానికి, కృష్ణా జిల్లాలో సగంభాగానికి పూలు సరఫరా అవుతాయి.
గణేశ్ ఉత్సవాలు నిర్వహించడానికి అప్పటికప్పుడు ఏర్పడే తాత్కాలిక సంఘాల్లో సభ్యుల సాంఘిక ఆర్ధిక స్ధాయిలు వేరువేరుగా వుండవచ్చు. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు వుండవచ్చు. అయితే ఉత్సవ నిర్వహణలో మాత్రం అందరిదీ ఒకటే మాట!
మనుషుల నమ్మకమే భారతదేశానికి బలం, శక్తి, సామర్ధ్యం…ఉత్సాహం…ఈ సెంటిమెంటే రకరకాల పువ్వులను ఒకే దారంతో దండగుచ్చినట్టు భారతీయల మధ్య సాంస్కృతిక ఐక్యతను సాధిస్తోంది. అందులో వినాయక చవితి ముఖ్యమైనది.
పందిళ్ళలో వినాయక చవితి నిర్వహించే సంఘాలు హైదరాబాద్ లో మాదిరిగా పోలీసుల, మున్సిపాలిటీల అనుమతులు ముందుగా తీసుకోడానికి అలవాటు పడలేదు. అలాంటి అనుమతి అవసరమని చాలామందికి తెలియదు. ”అనుమతుల కోసం పది దరఖాస్తులు మాకు వస్తున్నాయంటే అరవై చోట్ల పండుగ జరుగుతున్నట్టే మా లెక్క ” అని రాజమహేంద్రవరంలో ఒక పోలీసు అధికారి చెప్పారు. కమ్యూనిటీల పరంగా ఈ పండగ జరగడం బాగా పెరిగిందని ఆయన వివరించారు.