ఇంతకీ పవన్ కళ్యాణ్ కాకినాడ సభతో సాధించింది ఏమిటి? అనే సందేహం చాల మంది వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆ సభని ప్రత్యేక హోదా కోసమే నిర్వహించినా దానితో ఆయన ఉద్యమానికి సిద్దం కాలేదు. తెదేపా, భాజపాలని విమర్శించి వాటినీ దూరం చేసుకొన్నారు. కనీసం ఈ సభలో తన జనసేన పార్టీని ఏర్పాటు చేసుకొనే ప్రయత్నాలు చేసినా కొంత ప్రయోజనం ఉండేది. అదీ చేయలేదు. ఆ సభలో చేసిన అప్రస్తుత ప్రసంగం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కోవలసి వస్తోంది. ఆ సభ ద్వారా పవన్ కళ్యాణ్ సాధించింది ఏమీ లేకపోయినా ఊరికే కొత్త శత్రువులని సృష్టించుకొన్నట్లయింది.
నేటికీ తెదేపా ఇంకా పవన్ కళ్యాణ్ పట్ల సంయమనం పాటిస్తున్నప్పటికీ, భాజపా ఆయనని వదిలేసుకోవడానికి సిద్దపడినట్లే కనిపిస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర నేతలతో బాటు ఏపి రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ సిద్దార్థ నాథ్ సింగ్ పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేయడమే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఏపికి ఎంతో మేలు చేస్తున్న వెంకయ్య నాయుడుపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడాన్ని ఆయన ఖండించారు. అందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కూడా. పవన్ కళ్యాణ్ అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నారని సిద్దార్థ్ నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. వెంకయ్య నాయుడు ఎదిగిన కొద్ది ఒదిగే మనిషని కానీ పవన్ కళ్యాణ్ అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. 2014 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ తమ పార్టీకి మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞత ఉంది కానీ అంత మాత్రాన్న తమ పార్టీని, సీనియర్ నేతలని విమర్శిస్తే సహించబోమని అన్నారు. ఆయన తమ కూటమికి మద్దతు ఇచ్చారు తప్ప జనసేన పార్టీ ఎన్డీయే కూటమిలో భాగస్వామి కాదని సిద్దార్థ నాథ్ సింగ్ గుర్తు చేశారు.
ప్రత్యేక హోదా కారణంగా ఇప్పటికే భాజపా రాష్ట్రంలో ప్రజల నుండి చాలా వ్యతిరేకతని ఎదుర్కొంటోంది. పవన్ కళ్యాణ్ సభతో ఆ వ్యతిరేకత ఇంకా పెరిగింది. కనుక ఈ పరిస్థితికి కారణం అయిన పవన్ కళ్యాణ్ పై భాజపాకి ఆగ్రహం కలగడం సహజం.
అయితే పవన్ కళ్యాణ్ భాజపాని మాత్రమే లక్ష్యంగా చేసుకొని గట్టిగా విమర్శలు చేసి తెదేపా పట్ల కొంచెం మెతకగా వ్యవహరించడం వలన ఆయన భాజపాకి తెదేపాపై అనుమానం కలిగేలా చేశారని చెప్పవచ్చు. ఆయనని తెదేపాయే వెనుక నుండి ప్రోత్సహించి ఉండవచ్చని భాజపాకి అనుమానం కలిగితే ఆశ్చర్యం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించడంతో తెదేపా నేతలు, మంత్రులు ఎవరూ కూడా పవన్ కళ్యాణ్ విమర్శలకి జవాబిచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. అది కూడా భాజపాలో అనుమానం ఇంకా పెంచవచ్చు. ఇటువంటి సమయంలో మిత్రపక్షమైన తెదేపా తమకి అండగా నిలబడకుండా మౌనం వహించడం రాష్ట్ర భాజపా నేతలు జీర్ణించుకోవడం కష్టమే.
అయితే తెదేపా మౌనం కాకతాళీయమని భావించలేము. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా తెదేపా తెగించి ప్రత్యేక ప్యాకేజి తీసుకోవడానికి సిద్దపడితే ఆ ప్యాకేజి కూడా సంతృప్తికరంగా లేదు. పైగా అది తీసుకొన్నందుకు రాష్ట్ర ప్రజల, ప్రతిపక్షాల ఆగ్రహానికి, విమర్శలకి గురికావలసి వస్తోంది. బహుశః అందుకే మౌనం వహిస్తోందేమో. ఇంతకీ పవన్ కళ్యాణ్ తన సభతో ఏమి సాధించారంటే ఏమి లేకపోయినా తెదేపా-భాజపాల మధ్య చిచ్చుపెట్టగలిగారని చెప్పవచ్చు.