రాజకీయాల్లో తమ శక్తియుక్తుల మీద బలం మీద ఎంతైనా నమ్మకం వుండొచ్చు. కాని అధికారంలో వున్న వారు కీలక విషయాల్లో ప్రత్యర్థులను కూడా విశ్వాసంలోకి తీసుకోవడం ప్రజాస్వామ్యంలో వుండే సౌందర్యం. కాశ్మీర్ సమస్య ఉద్రిక్తమైనా కేంద్ర ప్రభుత్వం చాలా రోజులు సరైన వ్యూహం రూపొందించుకోలేదు. ఇప్పటికి అక్కడ కర్ఫ్యూలు కాల్పులు కొనసాగుతూనే వున్నాయి. పార్లమెంటులోనూ తీవ్ర చర్చ జరిగింది. అయితే అన్ని పార్టీలూ విమర్శలు చేసినా అభిప్రాయాలు చెప్పే అవకాశం కలిగింది. ఆ పైన అఖిలపక్ష సమావేశం కూడా జరిపి మరింత వివరంగా వారి సూచనలు సలహాలు తీసుకున్నారు. టెర్రరిజం విషయంలో రాజీ పడేది లేదని ఎప్పటి మాటే చెప్పినా అందరితో చర్చించినట్టయింది. అలాగే తెలంగాణలోనూ జిల్లాల విభజన విషయంలో స్థానికంగానూ అందరి అభిప్రాయాల సేకరణ కార్యక్రమం జరుగుతున్నది. ఆగష్టు 18న అఖిలపక్ష సమావేశం జరిపి దసరా నాటికి తుది నోటిఫికేషన్ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు.
ఇదే విధంగా ఆంధ్ర ప్రదేశ్కు ప్రత్యేక హౌదా నిరాకరణపై తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. అన్నిపార్టీలూ హౌదా విషయంలో ఇచ్చిన హామీకి కేంద్రం కట్టుబడివుండాలని అన్ని పార్టీలూ కోరుతున్నాయి. దీనిపై అఖిలపక్ష సమావేశం జరపాలని కూడా నిరంతరం సూచనలు వస్తున్నాయి. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం అందుకు ససేమిరా అన్నట్టు భీష్మించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మోడీ కెసిఆర్లు ప్రదర్శించిన వాస్తవిక దృష్టి అనుభవజ్ఞుడైన ఆయన ఎందుకు చూపలేకపోతున్నారు? అఖిలపక్షం జరిపితే వైసీపీనేత జగన్ హాజరు కావడంలేదా ఆ పార్టీకి ప్రాధాన్యత లభించడం అన్న కోణంలోనే ఆలోచించడం వల్ల ఇలా జరుగుతున్నదా? అఖిలపక్షంలో అధికార పార్టీకి సమన్వయ బాధ్యత వుంటుంది గాని ప్రతిపక్షం అభిప్రాయం చెప్పడం తప్ప చేయగలిగింది ఏముంటుంది? ఒకవేళ వారి సూచన మేరకు ఢిల్లీకి ప్రతినిధి బృందాన్ని తీసుకుపోయినా తన ఆధ్వర్యంలో తప్ప మరొకరికి పైచేయి ఎలా వస్తుంది? ఎందుకని చంద్రబాబు ఇందుకు నిరాకరిస్తున్నారు?