హైదరాబాద్ లో నాలాలు, చెరువు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం మొదలైంది. అప్పుడే ఆహా ఓహా అంటూ పొగడ్తలు కూడా మొదలయ్యాయి. వేలాది నిర్మాణాల వల్ల నగరంలో వరద ముప్పు పెరుగుతోంది. దశాబ్దాలుగా అక్రమ నిర్మాణాలపై కొరడా ఝళిపిస్తామనే మాటలు చాలా సార్లు ప్రజలు విన్నారు. ఇప్పుడుచర్య మొదలైంది.
సోమవారం గ్రేటర్ హైదరాబాద్ అధికారులు కూల్చవేతలు మొదలుపెట్టారు. నాలాలపై కట్టిన నిర్మాణాలు, ప్రహరీ గోడలు, భవనాల కూల్చివేత జోరుగా జరిగింది. సైబరాబాద్ మదీనా గూడ ప్రాంతంలో, ఉప్పల్ తదితర చోట్ల కూల్చివేతలు చేపట్టారు. తొలిరోజు 11 అక్రమ నిర్మాణాలను కూల్చేశారు. నాలాలపై నిర్మించిన స్లాబులు వగైరాలను కూడా కూలగొట్టారు.
బంజారా హిల్స్ లోని ఓ ఫంక్షన్ హాలు ప్రాంగణంలో అనధికార కట్టడాన్ని కూల్చేశారు. ఓ ప్రముఖుడు ఎకరం పైగా చెరువు స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన కన్వెన్షన్ సెంటర్ ను కూడా కూలుస్తారా అని నగర పౌరులు ప్రశ్నిస్తున్నారు. హుసేన్ సాగర చుట్టుపక్కల చెరువు శిఖం భూమిలో అనేక అక్రమ నిర్మాణాలున్నాయి. అలాగే హుసేన్ సాగర్ తో పాటు అనేక చోట్ల వరద ప్రవాహానికి అడ్డుగా బహుళ అంతస్తుల భవనాలను నిర్మించారు. మరి వాటికి జోలికి పోతారా అనేది ప్రశ్న.
న్యాయపరమంగా ఇబ్బందులు రాకుండా, నోటీసు జారీ చేసే అవసరం లేకుండా జీహెచ్ ఎంసి అధికారులు సెక్షన్ 405 కింద కూల్చివేతలు చేపట్టారు. సామాన్యులు, అనామకుల నిర్మాణాలపై ఉక్కు పాదం మోపుతున్నారు. శభాష్ శభాష్ అని చెప్పుకుంటున్నారు. ప్రముఖులు అక్రమంగా నిర్మించిన బడా భవంతులపై ఇంత వరకూ ఏ ప్రభుత్వమూ కొరడా ఝళిపించలేదు. మరి కేసీఆర్ మొన్న చెప్పినట్టు, అలాంటి నిర్మాణాలపైనా ఉక్కు పాదం మోపుతారా. ఇప్పటికే మాదాపూర్ ప్రాంతంలో ఆ మధ్య అక్రమ నిర్మాణాల కూల్చివేతలు హటాత్తుగా ఆగిపోయాయి. దాని వెనుక కారణాలపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఈ కూల్చివేతలు కూడా సామాన్యులపై ప్రతాపం చూపడానికే పరిమితం అవుతాయా?
నాలాలు, చెరువులపై నిర్మించిన ప్రతి కట్టడాన్ని కూల్చడం ద్వారా ప్రస్తుత ప్రభుత్వం చిత్తశుద్దిని చాటుకుంటుందా? ఏమో చూద్దాం.