తెలంగాణ పీసీసీకి కొత్త అధ్యక్షుడు త్వరలో రాబోతున్నారనే చర్చ గత కొన్ని నెలలుగా జరుగుతూనే ఉంది. జాతీయ స్థాయిలో రాహుల్ నాయకత్వ సంక్షోభం ముగియగానే, రాష్ట్రాలపై హైకమాండ్ దృష్టి పెడుతుందని అన్నారు. ఈ నెలలోనే కొన్ని రాష్ట్రాలకు చెందిన పీసీసీ నేతల ఎంపిక ఉంటుందనీ గతంలో కథనాలొచ్చాయి. పార్టీ అధ్యక్ష బాధ్యతల్ని మరోసారి సోనియా గాంధీకి అప్పగించారు. కాబట్టి, ఇప్పుడు రాష్ట్రాలపై దృష్టి సారిస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో మళ్లీ మరోసారి టీపీసీసీ అధ్యక్షుడు ఎవరనే చర్చ మొదలైందని సమాచారం. అయితే, తాజాగా కొంతమంది పార్టీ నాయకుల మధ్య భాజపా ప్రస్థావన ప్రముఖంగా వచ్చిందని తెలుస్తోంది.
రాష్ట్రంలో భాజపా కొత్త సవాల్ గా మారనుందనీ, తెరాసతోపాటు ఆ పార్టీని కూడా రాజకీయంగా ధీటుగా ఎదుర్కోవాల్సి ఉంటుందని గాంధీభవన్ లాబీల్లో కొందరు నేతలు మాట్లాడుకున్నారని సమాచారం. కేంద్ర హోం మంత్రి అమిత్ షా దగ్గర్నుంచీ అందరూ తెలంగాణ మీదే ఫోకస్ పెడుతున్నారనీ, అదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కూడా కార్యకలాపాలు పెంచాల్సి ఉంటుందనే అభిప్రాయం వారి మధ్య వ్యక్తమైంది. ఇదే సమయంలో తెరాసతోపాటు భాజపాకి కూడా గట్టిగా కౌంటర్లు ఇస్తూ పార్టీని నడిపించాలంటే బాగా దూకుడుగా వ్యవహరించే రేవంత్ రెడ్డికి పీసీసీ ఇస్తేనే కరెక్ట్ అని చర్చించుకున్నట్టు సమాచారం.
అయితే, కాంగ్రెస్ పార్టీలో పీసీసీ పదవి కోసం ఇప్పటికే చాలామంది పోటీ పడుతున్న పరిస్థితి. వీ హన్మంతరావు లాంటి సీనియర్ నేతలు ప్రాధాన్యత దక్కడం లేదంటూ అలిగి కూర్చున్నారు. జానారెడ్డి, కోమటిరెడ్డి, పొన్నాల.. ఇలా ఆశావహుల జాబితా పెద్దదే ఉంది. ఉత్తమ్ రికమండేషన్ తో మరికొందరు కూడా హైకమాండ్ కి టచ్ లో ఉంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో… కొద్దిమంది నేతలు రేవంత్ రెడ్డి సేవల్ని ఈ సమయంలో పూర్తిస్థాయిలో వాడుకోవడమే కరెక్ట్ అని అంటున్నా, దానికి మద్దతు ఉంటుందా అనేది ప్రశ్న? ఇవన్నీ దాటుకుని రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చినా… ఆయనకి భాజపా, తెరాస కంటే ముందు సొంత పార్టీలో నేతల్ని ఒకతాటిపైకి తేవడం మొదటి సవాల్ అవుతుంది. ఏదైమైనా… ఇకపై రెండు పార్టీలనూ ధీటుగా ఎదుర్కోవడం కోసం కాంగ్రెస్ సిద్ధమవ్వాలి. ఇప్పటికే కొంత ఆలస్యమైంది కూడా. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఈ క్రమంలో అంతర్గతంగా పార్టీలో అలజడీ తప్పదన్నట్టుగానే ప్రస్తుత పరిస్థితి ఉంది.