వైకాపా గురించి చాలా ఆసక్తికరమైన వార్త ఒకటి ‘ది ట్రిబ్యూన్’ అనే ఇంగ్లీష్ పత్రికలో వచ్చింది. ఆ పార్టీకి వచ్చే ఎన్నికలు చాలా కీలకమైనవి కావడంతో అందులో గెలిచేందుకు ఈసారి ఎన్నికల వ్యూహ నిపుణుడుగా పేరొందిన ప్రశాంత్ కిషోర్ సేవలని ఉపయోగించుకోవాలనుకొంటున్నట్లు పేర్కొంది. అందుకోసం వైకాపా ప్రతినిధులు ప్రశాంత్ కిషోర్ ని కలిసి మాట్లాడినట్లు ఆ పత్రిక పేర్కొంది.
ప్రశాంత్ కిషోర్ ఇంతవరకు ఏ రాష్ట్రంలోనైనా ఏ రాజకీయ పార్టీకి లేదా కూటమికి పనిచేసిన ఆ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తోంది కనుక ఆయనకి చాలా డిమాండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం ఆయన బృందం కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తోంది. వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహాలు అందించే బాద్యత తీసుకొని అప్పుడే పని కూడా మొదలు పెట్టేసింది.
గత ఎన్నికలలోనే తెదేపా-భాజపాల కూటమి చేతిలో కొద్దిపాటి తేడాతో ఓడిపోవడంతో జగన్మోహన్ రెడ్డి తీవ్ర నిరాశ చెందారు. కనుక వచ్చే ఎన్నికలలో వైకాపా తప్పనిసరిగా గెలిచి తీరాలి లేకుంటే జగన్ ముఖ్యమంత్రి కల ఇక ఎన్నటికీ నెరవేరకపోవచ్చు. అందుకే ప్రశాంత్ కిషోర్ ని ఆంధ్రా, తెలంగాణాలలో కూడా కాంగ్రెస్ పార్టీ బుక్ చేసేసుకోక ముందే వైకాపా బుక్ చేసుకోవాలని ప్రయత్నిస్తోందేమో?
జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు, ఏ సందర్భంగా మాట్లాడినా ఒకటే ముక్క పదేపదే చెపుతుంటారు. తెదేపా పాలనలో అవినీతి, అక్రమాలని చూసి చూసి ప్రజలు విసుగెత్తిపోయారని, కనుక ప్రజలందరూ వైకాపా వైపే చూస్తున్నారని గట్టిగా వాదిస్తుంటారు. మరి ప్రజలందరూ వైకాపావైపే ఉన్నప్పుడు, ఒకవేళ ఆ పత్రికలో పేర్కొన్నట్లు వైకాపా ప్రశాంత్ కిషోర్ సహాయం కోరడం నిజమైతే, జగన్మోహన్ రెడ్డి చెపుతున్న మాటలు అబద్దమనుకోవలసి ఉంటుంది లేదా తనపై తనకే నమ్మకం లేదని భావించవలసి ఉంటుంది. అపర చాణక్యుడు వంటి చంద్రబాబు నాయుడుని ఎదుర్కోవడం తన ఒక్కడి వల్ల కాదు కనుకనే ఆయనకి ధీటుగా ఎన్నికల వ్యూహాలు రచించగల ప్రశాంత్ కిషోర్ సేవలు ఉపయోగించుకోవాలనుకొంటున్నారేమో? మంచిదే కదా.