తెలంగాణ ఉద్యోగులకు జీతాలు ఒకటో తేదీ కల్లా ఇచ్చే ప్రయత్నాన్ని చేస్తామని ఆర్థిక మంత్రి హరీష్ రావు హుజురాబాద్లో ప్రభుత్వ ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. హరీష్ రావు మాటలు విని ఉద్యోగులు నిజమైతే బాగుండు అని అనుకున్నారు. కానీ ఆయన మాటలు విన్న సామాన్యులకు మాత్రం అదేంటి..? ఒకటో తేదీన జీతాలు ఇవ్వడం లేదా… జీతాలిస్తామని హామీలు ఇస్తారా అని ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఏపీలో ఉద్యోగులకు జీతాలు ఆలస్యమవుతున్నాయన్న విషయమే బాగా ఫోకస్ అయింది. కానీ తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉంది. దీన్ని హరీష్ రావు నేరుగా ఒప్పుకున్నారు. కరోనా కారణంగా ఆదాయం తగ్గిపోయి జీతాలు సమయానికి ఇవ్వలేకపోతున్నామని చెబుతున్నారు.
తెలంగాణలో రెండు, మూడు నెలలుగా ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగ సంఘాలేవీ నోరు తెరిచే పరిస్థితి లేకపోవడంతో పూర్తి సమాచారం బయటకు రావడం లేదు. కానీ చాలా చోట్ల ఉద్యోగులే జీతాల సంగతి మీడియాకు తెలియచేస్తున్నారు. దీంతో విపక్షాలు విమర్శలు ప్రారంభించాయి. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి తెలంగాణ చేరిందని… కొద్ది రోజులు ఆగితే దివాలా తీస్తుందని బండి సంజయ్, కిషన్ రెడ్డి తరచూ ఆరోపిస్తున్నారు. వీరి ఆరోపణలకు కౌంటర్ ఇవ్వడానికే ఇటీవల హరీష్ రావు ప్రత్యేక మీడియా సమావేశం పెట్టి దేశం కన్నా తెలంగాణ చాలా బెటర్గా ఉందని లెక్కలు చెప్పుకొచ్చారు. కానీ ఎంత బెటర్గా ఉన్నా ఉద్యోగుల జీతాలకు కష్టం అవుతున్న విషయం మాత్రం స్పష్టమయింది.
దళిత బంధు కోసం సీఎం కేసీఆర్ రూ. రెండు వేల కోట్లను మళ్లించారు . ఆ నిధులను కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఖాతాలో ఉంచారు. వాటి ద్వారా దళితులకు బంధు పథకం అమలు చేస్తారు. మరి జీతాలు సంగతేమిటి అని వస్తున్న అనుమానాలపై మాత్రం స్పష్టత లేకుండా పోయింది. కరోనా కారణం అని హరీష్ రావు చెబుతున్నప్పటికీ.. అది కాదని … దళిత బంధు కోసం నిధులు మళ్లించడమేనని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రభుత్వం అయినా ఒకటో తేదీన బాధ్యతగా జీతాలివ్వాలని అనుకుంటుంది..కానీ హరీష్ రావు ఒకటో తేదీన జీతాలిస్తామని హామీ ఇచ్చి ఓట్లు అడుగుతున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు అధికార పార్టీ నేతలుగా మారితే ఇలాంటి పరిస్థితే వస్తుంది.