‘రిటర్న్ గిఫ్ట్ కి థ్యాంక్స్’ అంటూ పవన్ కల్యాణ్ పంపిన సందేశం టాలీవుడ్ లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎక్కడ చూసినా ఇదే హాట్ డిస్కర్షన్. జగన్ హయాంలో తెలుగు చిత్రసీమకు అన్యాయం జరిగింది. అగౌరవం ఎదురైంది. అలాంటప్పుడు.. నిర్మాతల తరపున మాట్లాడింది కేవలం పవన్ కల్యాణ్ మాత్రమే. ‘నా సినిమాని ఆపుకోండి.. మిగిలినవాళ్లని వదిలేయండి’ అనే స్టేట్ మెంట్ ఇచ్చి – తన తెగింపు, త్యాగం నిరూపించుకొన్న వ్యక్తి. అసలు సిసలు సినిమా ప్రేమికుడు. అలాంటి పవన్ కల్యాణ్నే కెలకడానికి ప్రయత్నించారు. హరి హర వీరమల్లు సినిమా విడుదల ముందు ఆడిన ఈ థియేటర్ల బంద్ నాటకం… పవన్ కి తిక్క రేగేలా చేసింది. ఇప్పుడు లెక్కలు బయటకు తీయడానికి ఆయన రెడీ అవుతున్నాడు.
థియేటర్ల బంద్ వెనుక ఓ పెద్ద స్కామ్ దాగుందన్నది నూటికి నూరుపాళ్లు నిజం. తెలుగు చిత్రసీమ గురించీ, ఇక్కడి వ్యవస్థ గురించి తెలిసిన వాళ్లెవరికైనా ఈ సంగతి సులభంగా అర్థం అవుతుంది. పైకి.. థియేటర్ వ్యవస్థని కాపాడడానికీ, థియేటర్ యజమానుల ఆర్థిక ప్రయోజనాల కోసమే ఇదంతా అని అనిపిస్తుంది కానీ, అసలు థియేటర్లన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయి? పర్సంటేజీ విధానం అమలు చేస్తే ఎవరికి లాభం? అనే విషయాలు తెలిస్తే ఈ కుట్రదారులెవరో అర్థం అవుతుంది. ఏపీ, తెలంగాణల్లో ఉన్న థియేటర్లలో సగానికి పైగా అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, ఏసియన్ సునీల్ చేతుల్లో ఉన్నాయి. కొన్ని సొంతం.. చాలామట్టుకు లీజ్. మిగిలిన థియేటర్లపై కూడా వీళ్ల ఆధిపత్యం ఉంది. ఏ థియేటర్లో ఏ సినిమా ఆడించాలి? అనేది వీళ్లే డిసైడ్ చేయగలరు. వీళ్లు ఆడిందే ఆట.. పాడిందే పాట. ఇప్పుడు థియేటర్లకు పర్సంటేజీ విధానం అమలు చేస్తే లాభం వీళ్లకే. అందుకే వెనుకుండి ఈ తతంగం అంతా నడిపించారు. ఈ బంద్ కు ఉసిగొల్పింది వీళ్లే. అయితే యాక్టీవ్ నిర్మాణ సంస్థల్లో ముఖ్యమైన మైత్రీ మూవీస్, సితార ఎంటర్టైన్మెంట్స్, వైజయంతీ లాంటి పెద్ద సంస్థలు వీటిని వ్యతిరేకించాయి. దాంతో అసలు గొడవ మొదలైంది.
అద్దె, పర్సంటేజీ ఈ రెండు విధానాల వల్ల లాభాలూ ఉన్నాయి, నష్టాలూ ఉన్నాయి. అద్దె అంటే నికరమైన ఆదాయం. సూపర్ హిట్ సినిమాకూ, ఫ్లాప్ సినిమాకూ థియేటర్ల యజమానులకు వచ్చే ఆదాయంలో మార్పేం ఉండదు. కానీ పర్సంటేజీ అలా కాదు. ఓ సూపర్ హిట్ సినిమా వస్తే, నిర్మాత రాబడిలో కొంత థియేటర్ యజమాని పర్సంటేజీ రూపంలో లాక్కెళ్లిపోతాడు. కాకపోతే ఆ అంతరం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఉదాహరణకు అద్దె రూపంలో రూ.5 లక్షలు చెల్లించాల్సిన చోట, పర్సంటేజీ విధానం వల్ల రూ.10 లక్షలు ఇవ్వాల్సివస్తుంది. ఇదంతా నిర్మాత, డిస్టిబ్యూటర్ లాభాల్లో కోత అన్నమాట.
అలాగని ప్రతీ సినిమాకీ ఇదే పద్ధతి ఉండదు. చిన్న సినిమా విడుదలైతే లీజు దారులకు అద్దెలే కావాలి. పర్సంటేజీలు వద్దు. ఎందుకంటే చిన్న సినిమాలకు కలక్షన్లు ఉండవు కాబట్టి. అంటే హిట్ సినిమా నుంచి దోచుకోవడానికి రెడీ అయిన లీజు దారులు, ఫ్లాప్ సినిమా బాధల్ని పంచుకోవడానికి మాత్రం ముందుకు రారన్న మాట. ఒకవేళ చిన్న సినిమా కూడా పర్సంటేజీ విధానంపై ఆడించాలంటే థియేటర్కు వాటా ఎక్కువ ఇవ్వాల్సివస్తుంది. కలక్షన్ రూపంలో వంద రూపాయలు వస్తే, అందులో 60 శాతం థియేటర్ కి, మిగిలిన 40 శాతం నిర్మాతకీ. అంటే ఓ నిర్మాత సినిమాలు తీస్తోంది థియేటర్ లీజు దారుల కోసమని సర్దుకుపోవాలన్నమాట. ఇదెక్కడి న్యాయం??
ఎగ్జిబీటర్లంతా ఛాంబర్లో చాలా దఫాలుగా సమావేశమయ్యారు. తమ డిమాండ్లేంటో వినిపించారు. ఆ సమావేశాలకు పట్టుమని వంద మంది కూడా హాజరవ్వలేదు. తెలుగు రాష్ట్రాల్లో వెయ్యిమందికి పైగా ఎగ్జిబీటర్లు ఉంటే, సమావేశాల్లో కనిపించింది అందులో పది శాతం మాత్రమే. అంటే.. నిజానికి ఎగ్జిబీటర్లకు ఈ పర్సంటేజీ విధానంపై ఎలాంటి ఆసక్తీ లేదన్నమాట. ఎందుకంటే అద్దె అయినా, పర్సంటేజీ అయినా వాళ్లకు ఒరిగేది ఏం ఉండదు. ఎందుకంటే వాళ్ల థియేటర్లన్నీ ఎప్పుడో లీజులకు ఇచ్చేశారు. సొంత థియేటర్లు ఉన్నా, వాటిపై లీజు ఫీజు తీసుకొంటూ గడిపేస్తున్నారు. థియేటర్లు వాళ్లవైనా వాటిపై పెత్తనం లీజు దారులవే. ఇదంతా కేవలం లీజు దారులు ఆడిస్తున్న డ్రామా కాబట్టే, వీటితో ఎగ్జిబీటర్లకు ఎలాంటి లాభం లేదు కాబట్టి వాళ్లంతా సైలెంట్ అయిపోయారు.
నిర్మాతల్లో 90 శాతం మంది ఈ పర్సంటేజీ విధానానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పటికే నిర్మాతలు కుంగిపోతున్నారు. అన్ని రకాలుగా వాళ్లపై అదనపు భారం పడుతోంది. ఇప్పుడు పర్సంటేజీ అంటూ రాబడిలో వాటా అడిగితే – నిర్మాత అనేవాడు కనుమరుగైపోయే ప్రమాదం ఉంది. నిర్మాత ని కాపాడాలి అంటే.. అసలు ఈ వ్యవస్థనే సరిదిద్దాలి. అందుకే ఇప్పుడు పవన్ కల్యాణ్ ఆ దిశగా అడుగులు వేయబోతున్నట్టు అర్థం అవుతోంది.
థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదు, అందుకే ఆదాయాలు తగ్గుతున్నాయి అనేది అందరూ ఒప్పుకోవాల్సిన నిజం. అటు ఎగ్జిబీటర్లకూ, ఇటు డిస్టిబ్యూటర్లకూ, నిర్మాతకూ డబ్బులు మిగలాలంటే, ఈ మూడు వ్యవస్థలూ బాగు పడాలంటే ప్రేక్షకులు థియేటర్లకు రావాలి. అలా రావాలంటే థియేటర్లలో మౌళిక సదుపాయాలు సరిగ్గా ఉండాలి. ప్రేక్షకులు టికెట్ రేట్ చూసి భయపడడం లేదు. థియేటర్లో జరుగుతున్న దోపిడీకి భయపడుతున్నాడు. రూ.150 లకే టికెట్ కొనొచ్చు. కానీ థియేటర్లో పాప్కార్న్ రేట్ అంతకంటే ఎక్కువ. బయట ఇరవై రూపాయలకు దొరికే వాటర్ బాటిల్.. థియేటర్లలో 60 రూపాయలకు అమ్ముతున్నారు. పార్కింగ్ ఫీజు తో అదనపు భారం పడుతోంది. ఇదంతా థియేటర్ యజమానులకు వెళ్తుందా అంటే అదీ లేదు. ఈ డబ్బులు కూడా లీజు దారుల జేబుల్లోకే చేరుతున్నాయి. అందుకే ఈ అడ్డగోలుతనానికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కల్యాణ్.
ఓటీటీ, పైరసీ.. వీటిపై కూడా పరిశ్రమ దృష్టి పెట్టాలి. ఇప్పటికే ఓటీటీ చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయింది చిత్రసీమ. సినిమా విడుదలైన మూడు వారాలకు ఓటీటీలోకి వచ్చేస్తే, ఇక థియేటర్లకు ఎందుకు వెళ్తారు? సినిమా అనేది చవకైన వినోదం. దాన్ని అత్యంత ఖరీదుగా మార్చేసి థియేటర్లకు రానివ్వకుండా చేస్తోంది ఎవరు? ఈ సంక్షోభానికి బాధ్యులు ఎవరు? ఈ లెక్కలు బయటకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ కూడా అదే చేయబోతున్నారు.
ఇక నుంచి టాలీవుడ్ గేమ్ మారబోతోంది. లీజు దారుల అక్రమాల్ని, అడ్డగోలుతనానికీ చెక్ పెట్టి, ఎవరి కష్టానికి తగ్గ ప్రతిఫలం వాళ్లు అనుభవించేలా ఈ కూటమి ప్రభుత్వం చేయగలిగితే – టాలీవుడ్ కు మంచి రోజులు వచ్చినట్టే.