‘‘ఆ నలుగురు.. అంటూ రెండు రోజుల నుంచి వార్తలొచ్చాయి. వారి కబంధ హస్తాల్లోనే ఇండస్ట్రీ ఉన్నట్టు చెబుతున్నారు. ఆ నలుగురికి నాకు సంబంధం లేదు. ఆ నలుగురిలో నేను లేను’ అని స్పష్టం చేశారు నిర్మాత అరవింద్. టాలీవుడ్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై ఈ రోజు అరవింద్ హైదరాబాద్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘ఆ నలుగురు’ అనే మాట 15 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. తర్వాత నలుగురు.. పది మంది అయ్యారు. అది ఎవరూ పట్టించుకోలేదు. ఆ నలుగురికి నాకు సంబంధం లేదు. నేను అన్ని వదిలేశాను. 1500 థియేటర్లకి 15 లోపే నా దగ్గర ఉన్నాయి. అవి కూడా తర్వలో వదిలేస్తాను. నా పని సినిమాలు నిర్మించడమే’అన్నారు
‘థియేటర్స్ కి సంబంధించి ఏ మీటింగ్ కి నేను వెళ్లలేదు. మా సంస్థ నుంచి ఎవరిని కూడా వెళ్లొద్దు అని చెప్పాను. బంద్ అని చెప్పడం ఏకపక్షం నిర్ణయం. పవన్ కల్యాణ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా థియేటర్లు బంద్ చేయాలని అనుకోవడం నిజంగా దుస్సాహసం. ఎవరితో చర్చించకుండా అలా ఏకపక్షంగా థియేటర్స్ బంద్ అని ప్రకటించడం ఏమాత్రం సమంజసం కాదు. సమస్యలు వుంటే చర్చించి పరిష్కరించుకోవాలి కానీ ఇలా బంద్ అని ప్రకటించడం సరికాదు’ అన్నారు
ఇదే సమయంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటన గురించి ప్రస్తావించారు అరవింద్. థియేటర్స్ బంద్ అని చెప్పి పవన్ కళ్యాణ్ ని బెదిరిస్తున్నారా? అతని సినిమా వస్తున్న సినిమాలో బంద్ అని చెప్పడం ఏమిటి? ఆయన సినిమాలపై వ్యతిరేక లేదని కొందరు అంటారు కానీ, అనేటప్పుడు అలోచించుకొండి. ఆయన బాధ పడటంలో నిజాయితీ వుంది’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఇంతకాలమైనా ముఖ్యమంత్రిని కలవకపోవడంపై కూడా అరవింద్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఓ నిర్మాతని ఇదే విషయంపై అడిగితే పెద్దగా స్పందించలేదన్నారు అరవింద్. మొత్తానికి నిన్న పవన్ కల్యాణ్ ‘రిటర్న్ గిఫ్ట్’ ప్రెస్ నోట్ ఎఫెక్ట్ బాగానే పని చేసింది. ఈరోజు అరవింద్ స్పందించారు. మిగిలిన పెద్ద నిర్మాతలు, ఆ నలుగురు లిస్ట్ లో ఉన్నవాళ్లు కూడా ఇలానే ముందుకొచ్చి మాట్లాడితే జనాలకు క్లారిటీ దొరుకుతుంది.