ఆపరేషన్ సిందూర్కు దేశమంతా మద్దతు ప్రకటించింది. పార్టీలన్నీ తమ మద్దతు ఇచ్చాయి. అయితే బీజేపీ మాత్రం అదంతా తమ విజయమన్నట్లుగా ప్రచారం చేసుకుంటోంది . ఈ అంశంపై విమర్శలు ప్రారంభమయ్యాయి. స్వయంగా ప్రధాని మోదీ ఆ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ర్యాలీలు నిర్వహిస్తున్నారు. చివరికి సోఫియా ఖురేషి కుటుంబసభ్యులతోనూ పొగిడించుకున్నారు. పూలు చల్లించుకున్నారు. ఇలాంటి ప్రచారాలతో బీజేపీపై విమర్శలు పెరుగుతున్నాయి.
బీజేపీ ఆపరేషన్ సిందూర్ విజయాన్ని హైలైట్ చేస్త్ దేశవ్యాప్తంగా తిరంగా యాత్రలు నిర్వహిస్తోంది. ఈ యాత్రలు సైన్యాన్ని పొగడటం, ఆపరేషన్ సిందూర్ లక్ష్యాలను ప్రజలకు వివరించడం కోసమని చెబుతున్నారు. కానీ అక్కడ జరుగుతోంది అంతా బీజేపీ ప్రచారమే. ఆపరేషన్ సిందూర్ను ప్రచారం చేసేందుకు భారత రైల్వే టికెట్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోతో కూడిన ప్రకటనలు కనిపించాయి. ఈ విషయంపై కాంగ్రెస్ తీవ్ర విమర్సలు చేసింది. ఈ ఆపరేషన్ను పాకిస్తాన్పై గట్టి చర్యగా చిత్రీకరిస్తూ, గత ప్రభుత్వాల బలహీనతతో పోల్చి, హిందూ ఓటర్లను ఏకీకృతం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి.
కాంగ్రెస్ నాయకులు, ఆపరేషన్ సిందూర్ను బీజేపీ రాజకీయ లబ్ధి కోసం ఉపయోగిస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ ఆపరేషన్ను రాజకీయ కార్యక్రమాలలో ఉపయోగించడం సరికాదని అంటున్నారు. ఆపరేషన్ సిందూర్ను తిరంగా యాత్రలు, ప్రకటనలు, బహిరంగ సభల ద్వారా బీజేపీ మార్కెట్ చేసుకునే ప్రయత్నంలో ఉంది.
సైన్యం శౌర్యాన్ని రాజకీయ లబ్ధికి ఉపయోగిస్తున్నారని విపక్షాలు అంటున్నాయి. రాజకీయంగా సైన్యం విజయాలను వీలైనంతగా రాజకీయ పార్టీలు తక్కువగా ప్రచారం చేసుకుంటేనే మంచిదన్నది సామాన్యుల అభిప్రాయం.