ఆపరేషన్ సిందూర్లో భారత్ ఫైటర్ జెట్లను కోల్పోయిందని ఎన్ని జెట్లను కోల్పోయిందో చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. దేశంలో వస్తున్న ఈ ప్రశ్నలు అంతర్జాతీయ మీడియాలోనూ ప్రచారం అవుతున్నాయి. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో యుద్ధం అన్నాక రెండు వైపులా నష్టం ఉంటుందని చెప్పారు. ఫైటర్ జెట్స్ ఎన్ని కోల్పోయామన్నది ముఖ్యం కాదని..తప్పులు దిద్దుకుని గెలిచామా లేదా అన్నది ముఖ్యమని స్పష్టంచేశారు. దీంతో కాంగ్రెస్ తాము చెప్పింది నిజమేనని ఫైటర్ జెట్లను భారత సైన్యం కోల్పోయిందని పూర్తి వివరాలు చెప్పాలని డిమాండ్ ప్రారంభించింది.
గతంలోనూ నష్టం జరిగిందని చెప్పిన అనిల్ చౌహాన్
నిజానికి గతంలోనూ ఇదే మాట చెప్పారు సీడీఎస్ అనిల్ చౌహాన్. ఎన్ని జెట్లు అనే నెంబర్ చెప్పలేదు. కానీ పాకిస్తాన్ వాదనను మాత్రం తోసిపుచ్చారు. ఇప్పుడూ అదే చెప్పారు. అయితే కొత్తగా కాంగ్రెస్ వివరాలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తోంది . చెప్పడం వల్ల ఏం ప్రయోజనమో మాత్రం కాంగ్రెస్ కు అవగతం కావడం లేదు. పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చిందన్నది కళ్ల ముందు ఉన్న నిజం. భారత్ చావు దెబ్బకొట్టిందని పాకిస్తాన్ కూడా అంగీకరిస్తోంది. ఓ సారి యుద్ధానికి దిగిన తర్వాత మాకేం జరగలేదు అనుకుంటే అంత కంటే తప్పిదం ఉండదు. భారత్ కు ఎంతో కొంత నష్టం జరిగి ఉంటుంది.
ఎంత నష్టం జరిగినా అది సీక్రెట్ ఇన్ఫర్మేషన్ – శత్రువులకు తెలియకూడదు!
భారత్ కు ఎంత నష్టం జరిగి ఉందన్న విషయాన్ని దాచి పెట్టి ఉంచడం చాలా కీలకం. ప్రపంచ దేశాలకు … ముఖ్యంగా శత్రు దేశాలకు ఈ సమాచారం ఆయుధం కాకూడదు. భారత్ ఆర్మీ బలహీనతలు వారికి తెలియకూడదు. అందుకే జరిగిన నష్టాన్ని వీలైనంత వరకూ తెలియకుండా ఉంచుతారు.కానీ మన దేశ రాజకీయం మాత్రం భిన్నం. ఆ నష్టం వివరాలు బయటకు చెప్పి శత్రు దేశాలకు సమాచారం అందించాలని డిమాండ్ చేస్తూంటారు. రాజకీయం చేస్తూంటారు. కాంగ్రెస్ పార్టీ ఇదే రాజకీయం చేస్తోంది.
బీజేపీకి కౌంటర్ గా మరో వ్యూహం కాంగ్రెస్ వెదుక్కోవాల్సిందే!
యుద్ధంతో రాజకీయం చేయడం దేశానికి నష్టం. తాము గొప్పగా గెలిచామని.. సైన్యం పరాక్రమాన్ని బీజేపీ సొంతం చేసుకోవడం వల్ల సమస్య వస్తోంది. ఆ పార్టీ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు..కాంగ్రెస్ పార్టీ భారత్ కు ఎక్కువ నష్టం జరిగిందని ప్రచారం చేస్తోంది. ప్రజలకు నిజాలు చెప్పాలంటోంది. కానీ ఆ వ్యూహం కరెక్ట్ కాదు. బీజేపీ ప్రచారానికి మరో విధంగా కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చే ఆలోచనలు చేయాలి లేకపోతే కాంగ్రెస్ రాజకీయం వల్ల పాకిస్తాన్ కు మేలు జరిగే అవకాశం ఉంది.