పిల్లలతో రాజకీయాలు చేయాలని ఎవరూ అనుకోరు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హాస్టళ్ల పేరుతోబీఆర్ఎస్ జోరుగా రాజకీయాలు చేస్తోంది. తాను సర్వీస్ లో ఉన్నప్పుడు హాస్టళ్లపైనే దృష్టి పెట్టి ఐపీఎస్ అయినప్పటికీ ఐఏఎస్ పోస్టింగులు తీసుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యూహంలో ఇవన్నీ భాగమేమో కానీ ఇప్పుడో కొత్త ఇష్యూతో తెరపైకి వచ్చేశారు.
హాస్టల్ పిల్లలతో వర్షిణి అనే ఐఏఎస్ మాట్లాడిన ఆడియోతో కొత్త రాజకీయం
తెలంగాణ సాంఘిక సంక్షేమ హాస్టల్స్ సెక్రటరీగా వర్షిణి అనే ఐఏఎస్ పని చేస్తున్నారు. ఆమె సిన్సియర్ గా హాస్టల్స్ తిరిగి విద్యార్థుల సౌకర్యాలను పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం అన్నీ కల్పించలేకపోవచ్చు కానీ.. హాస్టల్ ను క్లీన్ గా ఉంచుకోవాలని చెబుతూంటారు. అయితే ఇలా చెబుతున్న ఓ ఆడియోను .. ఎవరో రికార్డు చేశారు. ఆ ఆడియోలో.. వర్షిణి పిల్లను టాయిలెట్స్ కూడా క్లీన్ చేసుకోవాలని చెప్పారని రచ్చ ప్రారంభించారు. జాతీయ ఎస్సీ కమిషన్ తో నోటీసులు ఇప్పించి దీన్ని జాతీయ స్థాయి అంశం చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలంతా ఈ వివాదాన్నే పట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఐఏఎస్ వర్షిణి తప్పు చెప్పారా ? వక్రీకరిస్తున్నారా ?
పిల్లలకు మొదటి నుంచి అన్ని నేర్పాలని వర్షిణి భావించారు. డిగ్నటీ ఆఫ్ లేబర్ గురించి ఆమె చెబుతూంటారు. మీ హాస్టల్ ను మీరు శుభ్రంగా ఉంచాలని చెప్పారు. అయితే అందులో ఆమె రెగ్యులర్ గా టాయిలెట్స్ క్లీన్ చేసుకోవాలని చెప్పారని.. బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ పనులు చేసే వర్కర్స్ ను తీసేసి మరి పిల్లలతో పనులు చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. నలుగురు శానిటేషన్ వర్కర్స్ ఒక వార్డెన్ మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ గురుకులాలలో కలిపి 1200 మంది ఉద్యోగులను తొలగించారని అంటున్నారు. ఐఏఎస్ వర్షిణి ఆడియోలో పిల్లలు అన్నీ శుభ్రం చేసుకోవాలని చెప్పారు కానీ ఆ వర్కర్లు ఉండరు వారి పనులు మీరే చేసుకోవాలని చెప్పలేదు.కానీ బీఆర్ఎస్ మాత్రం వాటిని కలిపి ప్రచారం చేస్తోంది.
ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి హాస్టల్స్ పైనే రాజకీయం
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి హాస్టల్స్ పై రాజకీయాలు జరుగుతున్నాయి. మొదట్లో వరుసగా ఫుడ్ పాయిజనింగ్ అయ్యేది. అలా ఎందుకు అయ్యాయో ఎవరికీ తెలియదు. ప్రభుత్వంలో పెద్దలు .. ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులు మారుతారు కానీ.. ఇక అధికారులు కింది నుంచి పై స్థాయి వరకూ ఒకరే. వ్యవస్థ కూడా మారదు. అయినా కాంగ్రెస్ రాగానే ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరిగాయి. గొడవలు జరిగాయి. ఇప్పుడు కొత్తగా పిల్లలతో టాయిలెట్లు కడిగిస్తున్నారని రాజకీయం ప్రారంభించారు. స్వేరో అని ఓ సంస్థను పెట్టి.. హాస్టళ్లలో తిష్ట వేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని.. ఇతర ఐఏఎస్లపై ఆయన కుట్రలు చేసి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసేందుకు వారిని బలి చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఐఏఎస్లూ బడుగు, బలహీనవర్గాలకు చెందినవారే.