ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేస్తూ నోట్ల కట్టలు పోగేసిన జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామాకు ససేమిరా అంటున్నారు. రాజ్యాంగంలో న్యాయవ్యవస్థకు ఉన్న అధికారం ప్రకారం న్యాయమూర్తుల్ని ఎవరూ తొలగించలేరు. వారు రాజీనామా చేయాలి లేదా రిటైర్ అవ్వాలి. తీసేయాలంటే పార్లమెంట్ ద్వారా అభిశంసించాల్సిందే. ఇప్పుడు న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే.. జస్టిస్ యశ్వంత్ వర్మను వ్యవస్థ నుంచి తప్పించాలి. కానీ ఆయన తాను తప్పు చేసినట్లుగా అంగీకరించేందుకు సిద్ధంగా లేరు. అందుకే అభిశంసించాలని నిర్ణయించారు.
జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన – అందరికీ సమ్మతమే
జస్టిస్ యశ్వంత్ వర్మ తప్పు చేసినట్లుగా సుప్రీంకోర్టు విచారణ కమిటీ తేల్చింది. రాష్ట్రపతికి నివేదిక సమర్పించింది. అయితే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశాలు లేవు. అందకే ఆయన రాజీనామా చేయాలని కొలిజీయం ద్వారా సమాచారం పంపినట్లుగా చెబుతున్నారు. కానీ ఆయన సిద్ధంగా లేరు. దాంతో ఇప్పుడు ఆయనను తప్పించడానికి అభిశంసన ఒక్కటే మార్గం. ఈ ప్రక్రియకు సన్నాహాలు చేస్తున్నారని చెబుతున్నారు. జస్టిస్ వర్మకు మద్దతుగా ఇప్పటి వరకూ ఏ పార్టీ మాట్లాడలేదు. ఆయన తప్పు చేయలేదని ఎవరూ చెప్పలేదు. సాధారణంగా రాజకీయాల్లో ఒకరు వ్యతిరేకిస్తే మరొకరు స్వాగతిస్తారు. ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు.
జగన్ లాంటి ధైర్యం ఎవరికీ లేదా ?
జగన్ రెడ్డి రౌడీ షీటర్లకే మద్దతు పలికి నేరుగా వెళ్లి పరామర్శించారు. అలాంటి ఓ అవినీతి న్యాయమూర్తికి మద్దతుగా ఉండేందుకు ముందుకు రాకపోవడం అనేది ఉండదు. జగన్ రెడ్డికి బలం ఉంటే ఖచ్చితంగా జస్టిస్ యశ్వంత్ వర్మకు మద్దతుగా మాట్లాడేవారు. ఆయన అడ్డంగా దొరికిపోలేదని.. చెప్పేవారు. జడ్జిలకు వజ్రాల వాచ్లను జగన్ రెడ్డి పంపించేవారన్న ప్రచారం కూడా ఉంది. అయితే ఇప్పుడు ఆయనకు అంత బలం లేదు. ఆయనలాంటి మనస్థత్వం జాతీయ రాజకీయాల్లో ఎవరికీ లేదు. ప్రజలు, వ్యవస్థ అంటే భయపడేవారే ఉంటారు. అందుకే అభిశంసన ఖాయమని అనుకుంటున్నారు.
ఇప్పటి వరకూ ఆరుగురిపై అభిశంసన ప్రక్రియ – కానీ
దేశంలో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఏ ఒక్క సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తిని కూడా అభిశంసన ద్వారా తొలగించలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(4) మరియు 218 ప్రకారం, “ప్రూవ్డ్ మిస్బిహేవియర్ లేదా అసమర్థత” ఆధారంగా న్యాయమూర్తులను తొలగించే ప్రక్రియను పార్లమెంటు రెండు సభలలో మూడో వంతు మెజార్టీతో ఆమోదించాలి. ఇప్పటి వరకూ ఆరుగురిపై అభిశంసన ప్రక్రియ ప్రారంభించారు. 1993లో సుప్రీం జస్టిస్ వి. రామస్వామి పై అభిశంసన పెట్టినా కాంగ్రెస్ మద్దతివ్వలేదు. ఆయనపై కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. 2011లో జస్టిస్ సౌమిత్ర సేన్ పై అభిశంసన ప్రక్రియ చెపట్టారు. కానీ ఆయన రాజీనామా చేశారు. జస్టిస్ ఎస్.కె. గంగేలే, జస్టిస్ జె.బి. పర్దివాలా, జస్టిస్ సి.వి. నాగార్జున రెడ్డి , జస్టిస్ దీపక్ మిశ్రా వంటి వంటి వారిపై ప్రక్రియ ముందుకు సాగలేదు. సౌమిత్ర సేన్, పి.డి. దినకరన్ అభిశంసన ప్రక్రియ పూర్తయ్యే ముందు రాజీనామా చేశారు. రాజీనామా చేయకుండా అభిశంసన ఎదుర్కొంటే జస్టిస్ యశ్వంత్ వర్మ మొదటి వారు అవుతారు.