కాంగ్రెస్లో పెద్దగా ప్రాధాన్యం దక్కడం లేదని భావిస్తున్న నేతలంతా కలిసి మాజీ ఎంపీ మధుయాష్కీ నివాసంలో సమావేశం అయ్యారు. విందు భేటీ అనంతరం చాలా అంశాలపై చర్చించారు. ఇలా పాల్గొన్న నేతల్లో విజయశాంతి కూడా ఉన్నారు. వీరి చర్చల సారాంశం ఏమిటంటే ఓ సినిమా తీయడం. ఉద్యమంలో కాంగ్రెస్ పాత్ర గురించి ప్రధానంగా ఈ సినిమాలో చెప్పాలని వారు నిర్ణయించారు. జానారెడ్డి, గుత్తా, కేకే కూడా ఈ భేటీకి హాజరయ్యారు.
పైకి తెలంగాణ కోసం జరిగిన ఉద్యమాల్లో కాంగ్రెస్ పార్టీ గురించి ప్రచారం చేయడమే ప్రాధాన్యం అని చెప్పినప్పటికీ అసలు వీరు తమ పాత్ర గురించి ప్రచారం చేసుకోవాలనుకుంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తమకు ప్రాధాన్యత దక్కడం లేదని.. ఇలాంటి సినిమాల ద్వారా తాము తెలంగాణ కోసం పోరాడిన వైనం.. తాము ఉద్యమకారుల కేటగిరిలోకి వచ్చే అంశాన్ని అందరికీ తెలిసేలా చేయడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
అయితే కమర్షియల్ గా సినిమా తీస్తే ఖర్చవుతుందని ఎవరూ చూడరని.. కానీ డాక్యుమెంటరీ రూపంలో తీస్తే విస్తృతంగా తమ పోరాటాల గురించి చర్చించవచ్చని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ సీనియర్ నేతలంతా విందు అయిపోయి..ఇళ్లకు వెళ్లిపోయిన తర్వాత కూడా ఈ సీరియస్ నెస్ చూపిస్తారా లేకపోతే.. అంతా సీనియర్లే కాబట్టే.. టైంపాస్ గా లైట్ తీసుకుంటారా అన్నది ముందు ముందు తెలుస్తుంది.