సరైన ప్రతిపక్షం లేకపోవడం, ఉన్న ప్రతిపక్షం ఉలిపికట్టె లాంటిది కావడం, అసాధారణ ఎమ్మెల్యేల బలం ఉండటం అధికార పార్టీకి చాలా సమస్యలు తెచ్చి పెడుతుంది. ఇప్పుడు ఏపీలో టీడీపీకి అదే పరిస్థితి కనిపిస్తోంది. ఎమ్మెల్యేలను దారిలో పెట్టడానికి, వారు దారి తప్పకుండా చూడటానికి పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చాలా ప్రయత్నాలు చేయాల్సి వస్తోంది.
పార్టీ నేతలందరితో టెలీ కాన్ఫరెన్స్ పెట్టిన టీడీపీ అధినేత.. పద్దతిగానే చెప్పాల్సింది చెప్పారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే వ్యవహారాలపై తన వద్ద నివేదికలు ఉన్నాయని.. పద్దతి మార్చుకోకపోతే వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోతారని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు చాలా విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు. సంపాదనకు అలవాటు పడుతున్నారు. చాలా కొద్ది మంది ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఇలాంటి వారి విషయంలో చంద్రబాబు చాలా పర్టిక్యులర్గా ఉండాలని నిర్ణయించుకున్నారు.
ఏడాది పాలన తర్వాత చంద్రబాబు .. ఎక్కువగా ఎమ్మెల్యేల ప్రవర్తన మీదనే అసంతృప్తిగా ఉన్నారు. చాలా మంది కొత్త ఎమ్మెల్యేలు, వైసీపీపై పోరాడాలు అని అవకాశం ఇచ్చారు. వారిలో చాలా మంది ఇప్పుడు తమ ప్రవర్తనను మార్చేసుకున్నారు. ఫలితంగా ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు. ప్రభుత్వ పని తీరుకు తగ్గట్లుగా ఎమ్మెల్యేలు ఉంటే.. సాఫీగా నడిచిపోతుంది. కానీ ఎక్కువగా ఉన్న ఎమ్మెల్యేలు.. ఉనికి లేని ప్రతిపక్షం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
రాజకీయాలు చేయాలంటే దందాలు చేయాలని కొంత మంది ఎమ్మెల్యేలు అనుకుంటూ ఉంటారు. కానీ ఆ దందాలు ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. ప్రజలకు సేవ చేస్తే డబ్బు అవసరం రాదు.దానికి నిమ్మల రామానాయుడు లాంటి వాళ్లే ఉదాహరణ. మరి ఇతర టీడీపీ ఎమ్మెల్యేలు ఎప్పుడు నేర్చుకుంటారో మరి !