కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల్లో ఓటమికి అప్పుడే కారణాలు వెదుకుతున్నట్లుగా ఉంది. బీహార్ ఎన్నికల్లో రిగ్గింగ్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. మహారాష్ట్రలో ఏం జరిగిందో.. బీహార్ లోనూ అదే జరుగుతుందని ఆరోపించారు.
గతంలో మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను రాహుల్ గాంధీ ఈవీఎంల మాయాజాలంగా అభివర్ణించారు. ఇప్పుడు పోలింగ్ ముగిసే ముందు అంటే సాయంత్రం ఐదు గంటల తర్వాత రిగ్గింగ్ చేశారని ఆరోపిస్తున్నారు. పోలింగ్ బూత్లలో ఇది జరిగిందని కావాలంటే.. నిరూపిస్తామని సీసీ ఫుటేజీని బయట పెట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. ఐదు గంటల వరకూ జరిగిన పోలింగ్ శాతానికి.. ఆ తర్వాత ఫైనల్ పోలింగ్ శాతానికి భారీగా తేడా ఉండటంతో రిగ్గింగ్ జరిగిందని రాహుల్ గట్టిగా నమ్ముతున్నారు.
ఎన్నికల కమిషన్ విషయంలో ఆయన మరింత అనుమానాస్పదంగా ఉన్నారు. మహారాష్ట్రలో ఇప్పుడు చేయగలిగిందేమీ లేదు. న్యాయపోరాటం చేసినా ప్రయోజనం ఏమీ కలగలేదు. అందుకే అలాంటి తప్పు బీహార్ లో జరగకూడదని అనుకుంటున్నారు. అందుకే ముందస్తుగా మైండ్ గేమ్ ప్రారంభించారని అనుకోవచ్చు. ఒక వేళ ఓడిపోతే.. అది రిగ్గింగ్ వల్లనే అనే కారణం రెడీమేడ్ గా రెడీ చేసుకున్నారు.
కానీ రిగ్గింగ్ అనేది అంత తేలికైన విషయం కాదు. అన్నీ సీసీ కెమెరాల్లో రికార్డు అవుతాయి. అయితే వాటిని బయట పెట్టడం లేదని రాహుల్ అంటున్నారు. ఈసీ పారదర్శకత పాటిస్తే చాలా వరకూ ఇలాంటి ఆరోపణలకు చెక్ పెట్టడానికి అవకాశం ఉంటుంది.