విజయ్ మాల్యా. ఆయన లండన్ పోవడానికి ముందు వరకూ దేశ ప్రజల్లో ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉన్న వ్యక్తి. డబ్బులు సంపాదించడం కాదు..దానితో ఎలా ఎంజాయ్ చేయాలో కూడా తెలిసిన వ్యక్తి అని చెప్పుకునేవారు. ఆయితే బ్యాంకుల వద్ద అప్పులు తీసుకుని ఎగ్గొట్టి పారిపోయాడన్న నిందను మోస్తున్నారు. నిజానికి ఆయన అప్పులు తీసుకున్నారు..కానీ ఎగ్గొట్టలేదు. ఆయన ఆస్తుల్ని వేలం వేసుకుని బ్యాంకులు రికవరీ చేశాయి.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో స్పష్టంగా ఈ వివరాలు ప్రకటించారు. విజయ్ మాల్యాకు చెందిన రూ. 14,131.6 కోట్లు విలువైన ఆస్తులను బ్యాంకులు జప్తు చేసుకున్నాయి. ఇది కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కు సంబంధించిన రూ. 6,203 కోట్ల రుణం వడ్డీతో సహా లెక్కవేసుకున్నా రెట్టింపు కంటే ఎక్కువ. మరి ఆయనను ఇంకా ఎందుకు నేరగాడిగా చూస్తున్నారు అనే ప్రశ్న వస్తోంది. అయితే ఆయనకు మద్దతుగా చాలా కొద్ది మంది మాట్లాడుతున్నారు. ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా మాత్రమే ఆయనకు మద్దతుగా ముందుకు వచ్చారు. పొలిటికల్ పంచ్ బ్యాగ్గా మాల్యాను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.
ఇప్పుడు మాల్యా ఎవరికీ అప్పు లేరు.. బ్యాంకులు రికవరీ చేసుకున్నాయి. ఎవరి సొమ్ము దొంగతనం చేయలేదు. 28 సంవత్సరాల వయస్సులో మాల్యా యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించాడు. అతని శైలికి తగ్గ వ్యాపారం కావడంతో విస్తరణలో దూకుడు చూపించాడు. మద్యం, ఏవియేషన్, రియల్ ఎస్టేట్ , స్పోర్ట్స్ రంగాల్లో విస్తృత సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఆడంబరమైన జీవనశైలి, హై-ప్రొఫైల్ వెంచర్లు, RCB , ఫార్ములా 1లో స్పాన్సర్షిప్ విజయ్ మాల్యాను వ్యాపార ప్రపంచంలో షో స్టాపర్ గా నిలిపాయి. కానీ ఎయిర్ లైన్స్ మొత్తంగా దెబ్బకొట్టింది.
రాజకీయాల్లోకి వచ్చి మాల్యా ఎంపీ అయ్యారు. అక్కడే ఆయన తప్పు చేశారేమో కానీ.. చాలా మంది కన్నా.. ఎక్కువగా శిక్ష అనుభవిస్తున్నారు. వేల కోట్లు నిజంగా బ్యాంకులు ఎగ్గొట్టిన వాళ్లు ఇండియాలోనే గౌరవంగా బతుకుతున్నారు. కానీ మాల్యా మాత్రం నేరగాడిగా ముద్ర వేసుకుని ప్రవాసంలో బతుకుతున్నారు. ఇటీవల నాలుగు గంటలకుపైగా ఇచ్చిన ఓ పాడ్ కాస్ట్ ఇంటర్యూ తర్వాత ఈ అంశంలో ఆయనకు మద్దతు లభిస్తోంది.