వైఎస్ఆర్సీపీ ఐదు సంవత్సరాల పాలనలో అసాంఘిక శక్తులు చెలరేగిపోయాయి. చట్టాలను చుట్టాలను చేసుకుని ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించారు. సామాన్యులను పీడించుకుతిన్నారు. వారందర్నీ .. శిక్షిస్తామని ఎవర్నీ వదిలే ప్రసక్తే లేదని నారా లోకేష్ ప్రకటించారు. రెడ్ బుక్ ను ప్రకటించారు. ప్రతి ఎన్నిక సభలోనూ రెడ్ బుక్ ప్రదర్శించి అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. చట్టబద్ధంగానే అన్ని చర్యలు ఉంటాయన్నారు. చట్టాల పవర్ ను ఇప్పుడు రెడ్ బుక్ ద్వారా చూపిస్తున్నారు. అక్రమార్కులు వణికిపోతున్నారు. జైళ్లకు పోతున్నారు.
రెడ్ బుక్ గురించి ప్రతి ఎన్నికల సభలో చెప్పిన నారా లోకేష్
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత. చాలా మంది మారణ హోమం ఉంటుందని అనుకున్నారు. ఎందుకంటే టీడీపీ వాళ్లు పడిన బాధలు అలాంటివి. కోడెల శివప్రసాదరావుతో సహా అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా మంది హత్యకు గురయ్యారు. వేల మందికేసుల పాలయ్యారు. జైళ్లకు వెళ్లారు. గ్రామాల్లో ఎన్నో కుటుంబాలు ఇళ్లకు పోలేని పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల సమయంలో జరిగిన హింసను చూస్తే.. . అధికారం రాగానే టీడీపీ కార్యకర్తలు ఆగరని.. తమను వేధించిన వారి అంతు చూస్తారని అనుకున్నారు. కానీ చంద్రబాబు, లోకేష్ అందర్నీ కంట్రోల్ లో ఉంచారు. ప్రతి ఒక్కరికీ.. చట్ట ప్రకారం శిక్ష ఉంటుందని భరోసా ఇచ్చారు. దాంతో ఎన్నికల అనంతర హింసను పూర్తి స్థాయిలో ఆపేశారు. చిన్న ఘటన జరగకుండా చూసుకున్నారు.
చట్టాన్ని అతిక్రమించకపోవడంతో అలుసుగా తీసుకుని బోనులో చిక్కిన వంశీ లాంటి నేరగాళ్లు !
ఆవేశంలో తీసుకునే ఏ నిర్ణయం అయినా అనర్థాలకు దారి తీస్తుంది. అందులో రెడ్ బుక్ అమలు విషయంలో చాలా నిగ్రహాన్ని పాటించారు. అన్ని రకాల న్యాయపరమైన పద్దతులతోనే అక్రమాల వేట సాగుతోంది. ఎవర్నీ చట్టాలకు అతీతంగా అరెస్టు చేయడం లేదు. దాన్నే అలుసుగా తీసుకున్న వల్లభనేని వంశీ వంటి వాళ్లు జగన్ రెడ్డి చెప్పే చిల్లర ఐడియాలను పాటించి.. జైలుకెళ్లి కూర్చున్నారు. వారంతటికి వారే దొరికిపోయేలా చేయడంలో రెడ్ బుక్ ది ప్రధాన పాత్ర. కొంత మంది గుండె ఆపరేషన్లు అని.. మరొకటని తప్పించుకుంటున్నారు కానీ ఇవాళ కాకపోతే .. రేపు వారికి చట్టం పవర్ తెలియకుండా ఉండదు.
వచ్చే ఏడాదిలో మరింత ఎక్కువగా అక్రమార్కుల వేట
రెడ్ బుక్ రాజ్యాంగం అని జగన్ రెడ్డి కలవరిస్తున్నారు. రాత్రిళ్లు నిద్రపట్టక సతమతమవుతున్నారు. ఏడాదిలో ఇప్పటి వరకూ జరిగింది కొంతే. జరగాల్సింది ఎంతో ఉంది. జగన్ రెడ్డి వరకూ అక్రమ కేసులతో వచ్చేస్తారేమోనని సజ్జల వంటి ఉద్దండులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దోచుకోవడం సక్రమం అనుకునేవారు.. అ పనుల్ని చేసినందుకు కేసులు పెడితే అక్రమం అనే అనుకుంటారు. ఇలాంటి వారికి వాస్తవాలు తెలియచేప్పడానికే రెడ్ బుక్. ఏడాదిలో రెడ్ బుక్ .. అద్భుత విజయం సాధించింది. చట్ట ప్రకారం అక్రమార్కులకు వణుకు పుట్టిస్తోంది.