కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యేందుకు కేసీఆర్ బయలుదేరుతున్నారని బీఆర్ఎస్ పార్టీ కొన్ని దృశ్యాలు విడుదల చేసింది. అందులో కవిత మెట్ల మీద నుంచి నడుచుకుంటూ వస్తూండగా అదే సమయంలో కేసీఆర్ లిఫ్ట్లో కిందకు వచ్చారు. లిఫ్టులో కవితను ఎందుకు రానివ్వలేదని చాలా మందికి డౌట్ వచ్చింది. ఆ సమయంలో కవిత ముఖంలో అంత ఉత్సాహం కనిపించ లేదు. కేసీఆర్ ఇతరులతో దట్టీ కట్టించుకుని వారితో కలిసి వెళ్లిపోయారు. తర్వాత కవిత ఎక్కడా కనిపించలేదు.
కేసీఆర్ తో మాట్లాడేందుకు ఆయన గది వద్దకు వెళ్లినా కవితతో మాట్లాడలేదు. లిఫ్ట్ లోకి వచ్చేటప్పుడు కవిత అక్కడే ఉన్నా.. రావాలని పిలవలేదు. కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ వెళ్తున్నారని కవిత ఉదయమే తన భర్తతో కలిసి ఫామ్ హౌస్ కు వెళ్లారు. లోపలికి వెళ్లగలిగారు కానీ.. కేసీఆర్ ఆమెను పట్టించుకోలేదు. కనీసం మాట్లాడలేదని తెలుస్తోంది. కేసీఆర్ తో పాటు కవిత కూడా బీఆర్కే భవన్ కు వెళ్తారని అనుకున్నారు. కానీ అక్కడి నుంచి కవిత ఇంటికెళ్లిపోయారు. ఎక్కడా కనిపించలేదు. అసలు ఫామ్ హౌస్ కు కవిత ను ఎవరూ ఆహ్వానించలేదని..ఆమె వచ్చినప్పటికీ కేసీఆర్ మాట్లాడలేదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
కవితతో మాట్లాడేందుకు కేసీఆర్ ఆసక్తిగా లేరని ఆమె రాజకీయాలపై అసంతృప్తితో ఉన్నారని స్పష్టమయిందని అంటున్నారు. తన రాజకీయ అడుగులకు.. జాగృతికి కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయని చెప్పుకునేందుకు కవిత ఆసక్తి చూపిస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం కవితతో మాట్లాడేందుకు కూడా ఆసక్తి చూపకపోవడం ద్వారా.. కవితకు తన మద్దతు లేదన్న సంకేతాలు ఇస్తున్నారు.
ఎలా చూసినా ఫామ్ హౌస్ లో కవితకు అవమానం జరిగిందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తండ్రిపై రాజకీయసాధింపులు చేస్తూంటే తాను మద్దతుగా వచ్చినా కనీస గౌరవం ఇవ్వలేదన్న భావనలో కవిత ఉన్నారని అంటున్నారు. ఈ పరిణామం మరిన్ని కీలక పరిణామాలకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది.