బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అనూహ్యంగా బీఆర్ఎస్ పాట పాడుతున్నారు. కేసీఆర్ కు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఆయన బీఆర్ఎస్ పార్టీని పొగుడుతూ.. కాళేశ్వరం కమిషన్ విషయంలో కేసీఆర్ కు అండగా ఉంటూ మీడియా ప్రకటనలు చేస్తున్నారు. ఇంటర్యూలు ఇస్తున్నారు. కమిషన్ ముందు ఇచ్చిన వాంగ్మూలం కూడా హైలెట్ అయింది. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ నాయకుడిగానే కనిపిస్తున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవికి పోటీ పడుతూ ఇలాంటి రాజకీయం ఎందుకు చేస్తున్నారన్నది హాట్ టాపిక్ గా మారుతోంది.
అధ్యక్ష పదవి కోసం వ్యూహాత్మక ఎత్తుగడ
ఈటల రాజేందర్ చాలా వ్యూహాత్మకంగానే బీఆర్ఎస్, కేసీఆర్ అనుకూల కామెంట్లు చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. బీజేపీని బీఆర్ఎస్లో విలీనం చేసే ప్రక్రియ సాఫీగా సాగాలంటే..దాన్ని అంగీకరించే నాయకుడు ఉండాలి. బండి సంజయ్ బీఆర్ఎస్ నీడను సహించేలా లేరు. ఇతరులు కూడా బీఆర్ఎస్ విలీనాన్ని వ్యతిరేకిస్తారు. కానీ తాను మాత్రం బీఆర్ఎస్ విలీనాన్ని స్వాగతిస్తానన్న సంకేతాలను హైకమాండ్ కు ఈటల పంపుతున్నారు. సాఫ్ట్ గా విలీనం పూర్తవుతుందన్న భరోసాను ఆయన ఇస్తున్నట్లుగా భావిస్తున్నారు.
బీఆర్ఎస్ను పొగడాల్సిన అవసరమే లేదు !
ఈటల రాజేందర్ సీనియర్ నాయకుడు. ఎలాంటి రాజకీయాలు చేయాలో ఆయనకు తెలుసు. భారత రాష్ట్ర సమితిలో ఎంత ఘోరమైన పరిస్థితుల మధ్య తాను బయటకు రావాల్సి వచ్చిందో ఆయనకు తెలుసు. జాతీయ పార్టీలో ఇప్పుడు ఆయన పలుకుబడి ఉన్న నేత. కేసీఆర్ కన్నా బెటర్ పొజిషన్ లో ఉన్నారు. ఇప్పుడు మళ్లీ తనను గెంటేసిన పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం లేదు. వెళ్లరు కూడా. చాలా మంది కాళేశ్వరం వాంగ్మూలం తర్వాత ఈటల బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారని ప్రచారం చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీనే బీజేపీలో కలిపే ప్రయత్నం చేస్తున్నారని ఊహించలేకపోతున్నారు.
హైకమాండ్ ఆలోచనను బట్టే !
బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తారా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. కానీ గతంలో చర్చలు జరిగాయని నిర్ణయం తీసుకున్నారని కవిత చెబుతున్నారు. అది ఎప్పుడైనా జరగవచ్చన్న ఉద్దేశంతోనే కవిత సొంత కుంపటి పెట్టుకుంటున్నారు. కానీ ఇంకా బీజేపీ హైకమాండ్ నుంచి ఎలాంటి స్పందన లేదు. వారు వ్యహాత్మకంగా ఉంటారు. సమయం చూసి నిర్ణయం తీసుకుంటారు. బీఆర్ఎస్ను విలీనం చేసుకోవాలనే ప్లాన్ ఉంటే..ఈటల రాజేందర్ నే అధ్యక్షుడిగా నియమిస్తారని అనుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్ని రాజేందర్ వ్యూహాత్మకంగా తెచ్చుకుంటున్నారు.