ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ ఫోన్లను అప్పగించాలని ఏసీబీ అధికారులు ఆదేశించారు. దానికి బుధవారం వరకూ గడువు విధించారు. కేటీఆర్ ఫోన్లను అప్పగిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఫార్ములా ఈ వ్యవహారం జరిగిన రెండు, మూడేళ్ల కాలంలో వాడిన ఫోన్లు అన్నింటినీ తీసుకు రావాలని ఏసీబీ అధికారులు చెప్పారు. గతంలో లిక్కర్ కేసులో కవిత .. చాలా ఫోన్లను ఈడీ అధికారులకు ఇచ్చారు. అలాగే ఇప్పుడు కేటీఆర్ కూడా నాలుగైదు ఫోన్లను ఇవ్వాల్సి ఉంటుందని భావిస్తున్నారు.
కేటీఆర్ ఫోన్లను అప్పగిస్తారా లేదా అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. ఫోన్లలో వ్యక్తిగత సమాచారం ఉంటుంది కాబట్టి అప్పగించే అవకాశం లేదని చెబుతున్నారు. అప్పగించకపోతే ఏసీబీ అధికారులు ఏం చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. మరో వైపు విదేశీ సంస్థకు డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసిన ఐఏఎస్ అరవింద్ కుమార్ ను, కేటీఆర్ ను ముఖాముఖి విచారించేందుకు ఏసీబీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విదేశీ పర్యటనలో ఉన్న అరవింద్ కుమార్ తిరిగి రానున్నారు.
అప్పట్లో ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితంగా ఉన్న అరవింద్ కుమార్.. వారు చెప్పినట్టల్లా చేశారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా కేవలం కేటీఆర్ ఆదేశాలతోనే డబ్బులు బదిలీ చేశానని ఆయన గతంలో స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ క్రమంలో ఇద్దర్నీ కలిపి ప్రశ్నిస్తే కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.