చెవిరెడ్డితో పాటు ఆయన బినామీగా ప్రచారంలో ఉన్న వెంకటేష్ నాయుడు అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి విజయవాడకు తీసుకు వచ్చారు. ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నారు. ఇప్పుడు వారి కోసం ఎవరు వాదిస్తారు.. జగన్మోహన్ రెడ్డి ఎవర్ని లాయర్ గా అపాయింట్ చేస్తారన్నది వైసీపీ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. గ్రేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి నల్లకోటు సర్దుకుని బయలుదేరి ఉంటారా లేకపోతే ఆయన ట్రాక్ రికార్డుకు భయపడి చెవిరెడ్డి సొంతంగా ఎవర్నైనా ఏర్పాటు చేసుకుని ఉంటారా అన్నది తేలాల్సి ఉంది.
చెవిరెడ్డి ఖర్చుకు వెనుకాడే లీడర్ కాదు. విచ్చలవిడిగా ఖర్చుపెడతారు. జగన్ మోహన్ రెడ్డి.. నిరంజన్ రెడ్డిని ఏర్పాటు చేయకపోతే..తానే స్వయంగా .. మరో ప్రముఖ లాయర్ ను ఏర్పాటు చేసుకోగలరు. కానీ పొన్నవోలు అంటే మాత్రం.. భయపడే అవకాశం ఉంది. పొన్నవోలు వాదనా సామర్థ్యాన్ని అందరూ ప్రత్యక్షంగా చూస్తున్నారు. అయినా ఎందుకు ఆయనను ప్రోత్సహిస్తున్నారో…వైసీపీ నేతలకే అర్థం కాదు.
కొమ్మినేని రావాల్సిన బెయిల్ ను జడ్జితో వాదన పెట్టుకుని రాకుండాచేశారు. చివరికి సుప్రీంకోర్టుకు పోవాల్సి వచ్చింది. పెద్ద వయసు అని చెప్పి సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకున్నారు. అయితే ఢిల్లీలో కూడా పొన్నవోలు నల్లకోటు వేసుకుని అది కూడా తన ప్రతాపమే అన్నట్లుగా మాట్లాడారు. అంటే ఇప్పుడు చెవిరెడ్డికీ ఆయనే దిక్కు అయి ఉంటుందన్నది అభిప్రాయం వినిపిస్తోంది.