ఫార్మలా ఈ రేసు కేసులో పోలీసులు అడిగిన విధంగా ఫోన్లు, ల్యాప్ ట్యాప్ ఇచ్చేందుకు కేటీఆర్ నిరాకరించారు. పోలీసులు విధించిన గడువు ముగిసిన చివరి రోజున తనకు వ్యక్తిగత గోప్యత చాలా ముఖ్యమని అందుకే తన ఫోన్లు ఇవ్వబోనని లేఖ పంపారు. దీనిపై ఏసీబీ అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారు. కానీ కేటీఆర్ చెప్పిన వ్యక్తిగత గోప్యత అనే కారణం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఓ వైపు ఫోన్ ట్యాపింగ్ అంశంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్న సమయంలో వ్యక్తిగత గోప్యత అనేది బీఆర్ఎస్ హయాంలో ఎలా ఉల్లంఘనకు గురయిందో వెలుగులోకి వస్తోంది.
ఓ నేరం విచారణ కోసం ఏసీబీ అధికారులు ఫోన్ అడిగారు. కానీ గత ప్రభుత్వంలో ఏం జరిగింది?. ఏ నేరం చేయకుండానే… అందరి ఫోన్ నెంబర్లను మావోయిస్టుల సానుభూతిపరుల పేరుతో ఎక్కించేసుకుని అధికారికంగా ఫోన్ ట్యాపింగ్ చేశారు. వారందరికీ వ్యక్తిగత స్వేచ్చ ఉండదా?. తప్పుడు మార్గంలో వారి వ్యక్తిగత వివరాలు తెలుసుకుని ఇబ్బంది పెట్టడం .. ఏ చట్టం ప్రకారం సమ్మతం?. ఫోన్ ట్యాపింగ్ పై ఆరోపణలు అబద్దం… ఆధారాల్లేవని గట్టిగా వాదించవచ్చు కానీ.. జరిగిన పరిణామాలే వాటికి సాక్ష్యాలుగా కళ్ల ముందు కనిపిస్తూ ఉంటే సామాన్య జనం నమ్మకుండా ఉంటారా ?
షర్మిల తన వాయిస్ ను తనకే వినిపించారని చెబుతున్నారు. సొంత పార్టీనేతలే కాదు.. పొరుగున ఉన్న ఏపీకి చెందిన టీడీపీ నేతల వాయిస్లనూ ట్యాపింగ్ చేశారు. ఓ ముఖ్యమంత్రి వాయిస్ రికార్డింగ్ బయటకు వచ్చి.. టీవీల్లో వైరల్ చేసేంత సాహసం చేయగలిగారంటే.. ఆ తెంపరితనాన్ని ఏమి అనుకోవాలి. మావోయిస్టుల సానుభూతిపరుల పేర్లతో.. ట్యాపింగ్ చేసిన వారి ఫోన్ నెంబర్లన్నీ బయటకు వస్తే.. గత ప్రభుత్వం చేసిన అరాచకం ఏమిటో ప్రజల ముందు ఉంటుంది. ఇప్పుడు వ్యక్తిగత గోప్యత అంటున్న కేటీఆర్ మాటలకు విలువ తెలుస్తుంది.