దక్షిణాదిలో విజయవంతమైన వ్యాపారవేత్తల కుటుంబంలో వివాదాలు ప్రారంభమయ్యాయి. సన్ గ్రూప్ పేరుతో దేశవ్యాప్తంగా అనేక రంగాల్లో విస్తరించి .. లక్ష కోట్లకుపైగా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన మారన్ సోదరుల మధ్య వివాదాలు ప్రారంభమయ్యాయి. కరుణానిధికి సమీప బంధువు అయిన మురసోలి మారన్ కుమారులు అయిన కళానిధి, దయానిధి మారన్లు మొదటి నుంచి సఖ్యతగా ఉండేవారు. కళానిధి వ్యాపారాలు చూస్తే.. దయానిధి రాజకీయాల్లో ఉండేవారు. అయితే ఇప్పుడు ఇద్దరి మధ్య సరిపడటంలేదు.
సన్ టీవీ నెట్వర్క్, భారతదేశంలోని అతిపెద్ద మీడియా సంస్థలలో ఒకటి. కళానిధి మారన్ నేతృత్వంలో ఉంది. కానీ దయానిధి మారన్కు సన్ టీవీలో గణనీయమైన వాటా ఉంది. కళానిధి మారన్ సన్ టీవీ రోజువారీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఆస్తులు, వ్యాపారాల నిర్వహణ విషయంలో మారన్ కుటుంబ సభ్యుల మధ్య 2007లో ఒప్పందం చేసుకున్నారు. కానీ అవి అమలు జరగడం లేదని దయానిధి మారన్ న్యాయపోరాటం ప్రారంభించారు.
గత ఏడాది దయానిధి మారన్ సన్ టీవీలో తన కుటుంబ వాటా గురించి స్పష్టత కోరుతూ కోర్టులో పిటిషన్ వేశాడు. సన్ టీవీ షేర్ల బదిలీ ,డివిడెండ్ చెల్లింపులపై పారదర్శకత లేదని.. ఎలాంటిసమాచారం చెప్పడం లేదని పిటిషన్లో ఆరోపించారు. ఈ వివాదం ప్రస్తుతం చెన్నైలోని కోర్టులలో ఉంది. సన్ టీవీని తనకు అప్పగించాలని దయానిధి మారన్ డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం తమిళనాట రాజకీయవర్గాల్లోనూ కలకలం రేపుతోంది.
సన్ టీవీ డీఎంకేకు చాలా కీలకమైన మీడియా గ్రూప్. ఆ గ్రూప్ సపోర్టు డీఎంకేకు ఉంది. కరుణానిధి ఉన్నప్పుడు ఓ సారి విబేధాలు రావడంతో కరుణానిధి స్వయంగా కలైంజ్ఞర్ టీవీని ప్రారంభించుకున్నారు. తర్వాత మళ్లీ కలసిపోయారు. ఇప్పుడు సోదరుల మధ్య వివాదాలు వచ్చాయి.