బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని వరంగల్ సుబేదారి పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఆయన విదేశాలకు వెళ్తున్న సమయంలో అరెస్టు చేసి.. వరంగల్ కు తరలించారు. క్వారీ యజమాని అయిన మనోజ్ రెడ్డి నుండి రూ. 50 లక్షలు డిమాండ్ చేస్తూ బెదిరించినట్లు ఫిర్యాదు చేశారు. మనోజ్ రెడ్డి భార్య కట్టా ఉమాదేవి ఫిర్యాదు ఆధారంగా నమోదు అయింది. ఆమె హుజూరాబాద్ నియోజకవర్గంలో గ్రానైట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వ్యాపారం సజావుగా సాగాలంటే తనకు డబ్బులు ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేసినట్లుగా మనోజ్ రెడ్డి భార్య ఫిర్యాదు చేశారు.
పాడి కౌశిక్ రెడ్డి గతంలో పోలీసులపై దౌర్జన్యం చేసిన కేసుల్లోనూ అరెస్టు అయ్యారు. అయితే చాలా సార్లు ఆయన స్టేషన్ బెయిల్స్తోనే బయటకు వచ్చారు. ఒక్క సారి కూడా జైలుకు వెళ్లలేదు. అవన్నీ రాజకీయ పరమైన కేసులు. అందుకే ఆయనకు బెయిల్ లభించింది. ఇది వ్యాపారిని బెదిరించిన కేసు. బెయిల్ రావడం కష్టమన్న అభిప్రాయం ఉంది. వరంగల్ లో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయన ను కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది.
కౌశిక్ రెడ్డి గతంలో కాంగ్రెస్ లో ఉండేవారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీప బంధువు. ఆయన ద్వారానే కాంగ్రెస్ లో ప్రాధాన్యం పొందారు. అయితే హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలో ఆయన బీఆర్ఎస్ లో చేరారు. అప్పట్లో ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చారు. గెలిపించకపోతే ఆత్మహత్య చేసుకుంటామని కుటుంబంతో సహా వీడియో రిలీజ్ చేసి.. ఎన్నికలకు ముందు ఓటర్లను బ్లాక్ మెయిల్ చేసి గెలిచారన్న విమర్శలు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉండటంతో ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. తరచూ వార్తల్లో ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.