ఐ లవ్ పాకిస్తాన్ అని ట్రంప్ అన్నారని మురిసిపోయారు. ట్రంప్ లంచ్కు పిలిచాడని ఆర్మీ చీఫ్ మునీర్ ఎగేసుకుంటూ వెళ్లాడు. ట్రంప్ అలా పిలవడానికి కారణం.. ఇరాన్ పై దాడికి అమెరికా సిద్ధమవడమే. పాకిస్తాన్, ఇరాన్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. అంతే కాదు.. పాకిస్తాన్ సరిహద్దు దేశం కూడా. తాము ఇరాన్ పై దాడి చేయడానికి పాకిస్తాన్ బేస్ ను వాడుకునేందుకు అమెరికా సిద్ధమవుతోంది. అదే జరిగితే ఇరాన్ కు.. పాకిస్తాన్ కూడా శత్రుదేశం అవుతుంది. అమెరికా పాక్ గడ్డపై నుంచి ఇరాక్ పై బాంబులేసి తన దారిన తాను పోతుంది. కానీ ఇలాంటి చాన్స్ ఇచ్చినందుకు ఇవాళ కాకపోతే రేపైనా ఇరాన్.. పాకిస్తాన్ సంగతి చూడకుండా ఉండదు.
భారత్ లో చాలా మంది ట్రంప్.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ను .. ట్రంప్ విందుకు పిలవడంపై రకరకాలుగా స్పందించారు. మోదీని బెస్ట్ ఫ్రెండ్ అంటూనే.. ఇలా చేస్తున్నారేమిటని ఆశ్చర్యపోయారు. కానీ అగ్రరాజ్యం లెక్క అగ్రరాజ్యానికి ఉంటుంది. పాకిస్తాన్ ను యుద్ధంలో ఓ పావుగా వాడుకునేందుకు మాత్రమే ఆయన రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ ను ఆయన బలి పశువు చేయబోతున్నారు. ట్రంప్ ట్రాప్ లో పడేందుకు మోదీ సిద్ధంగా లేరు. కెనడాలో ఉన్నప్పుడు మోదీకి ఫోన్ చేసి.. వైట్ హౌస్ కు రావాలని కోరారు. తాను రానని మోదీ డైరక్ట్ గా నే చెప్పారు.
అయితే త్వరలో క్వాడ్ దేశాల మీటింగ్ ఇండియాలో జరగనుంది. ఆ సమావేశానికి ట్రంప్ వస్తారు. కానీ పాకిస్తాన్ పర్యటనకు వెళ్లరు. గతంలో ఏ అమెరికా అధ్యక్షుడు ఉపఖండంలో పర్యటించినా ఖచ్చితంగా మొదట భారత్ కు వచ్చి ఆ తర్వాత పాకిస్తాన్ కు వెళ్లామో..లేకపోతే అక్కడకు వెళ్లి.. ఇక్కడకు రావడమో చేస్తారు. ఈ సారి ట్రంప్ పాకిస్తాన్ ను పక్కన పెట్టేస్తున్నారు.
ట్రంప్నకు పాకిస్తాన్పై ఎలాంటి ప్రేమ లేదు. ఆయనకు తన స్వార్థం మాత్రమే తనకు తెలుసు. ఇరాన్ సంగతి తేల్చడానికి ఆయన పాకిస్తాన్ ను వాడబోతున్నారు. ఆ తర్వాత పాకిస్తాన్ పరిస్థితి మరింత దుర్భరంగా మారనుంది.