కేసీఆర్ జడ్జిల ఫోన్లూ ట్యాప్ చేయించారని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తేల్చారు. కొత్తపలుకులో ట్యాపింగ్ అంశంపై కీలకమైన విషయాలు వెల్లడించారు. తెలంగాణలో విచ్చలవిడిగా జరిగిన ట్యాపింగ్ తో ఎంతో మంది ని ఇబ్బందిపెట్టారని.. అనధికారికంగా పెగాసస్ను వాడారన్న అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో కేసీఆర్ కు వ్యతిరేకంగా ఆధారాలు దొరుకుతాయో లేదో ఆయన చెప్పలేకపోయారు కానీ.. దొరికితే మాత్రం జగన్ కూడా ఇరుక్కుపోయినట్లేనని విశ్లేషించారు.
షర్మిల ఫోన్ ను ట్యాప్ చేసి.. ఆ రికార్డుల్ని జగన్ కు పంపారు. అక్కడ్నుంచి వైవీ సుబ్బారెడ్డికి వచ్చాయి. సుబ్బారెడ్డి బెదిరించడానికో.. భయ పెట్టడానికో లేకపోతే షర్మిలను జాగ్రత్తగా ఉండాలని చెప్పడానికో..ఆ ఆడియో వినిపించి ఉంటారు. ఇప్పుడు షర్మిల ఆ విషయాన్ని బయట పెట్టారు. నిజంగా ఆయన దగ్గర ఉందని సిట్ అధికారులు గుర్తిస్తే…అది ఎక్కడి నుంచి వస్తుందో గుట్టు బయటకు లాగుతారు. అప్పుడు జగన్ రెడ్డికూడా ఇరుక్కుపోయినట్లేనని ఆర్కే భావన.
అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి సామాన్య జనం సీరియస్ గా తీసుకోవడం లేదని ఆర్కే చెబుతున్నారు. ఆయన ఎందుకలా అనుకున్నారో కానీ .. నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది.. వ్యక్తిగత వివరాలు చాటుగా విన్నారు.. వాటి ద్వారా చేయకూడని పనులు చేశారని బయటకు వచ్చిన రోజున.. జరిగే పరిణామాలు ఊహించడం కష్టం . ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ప్రచారం అంతా ఊహాగానాలే. నిజాలు కాదు. అందుకే ప్రజలు పెద్దగా పట్టించుకోకపోవచ్చు కానీ నిజం అని తెలిసిన రోజున ఎవరూ ఊపేక్షించరని అనుకోవచ్చు.
ఇదే సమయంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా బయటపడిన వివరాలతోనే గతంలో ఈటల , హరీష్ రావును కేసీఆర్ దూరం పెట్టారని ఆర్కే అంటున్నారు. ఇలాంటివి నిజం అని తేలితే ఆయన మనుషుల్లో ఏర్పడే భావోద్వేగాలతో మొత్తం కేసీఆర్ కుటుంబం చిన్నాభిన్నమైపోతుంది. ఇప్పటికే ఇచ్చిన క్రాకులు మరింత పెరుగుతాయి. నిజంగా కేసీఆర్ ట్యాపింగ్ చేసిన దానికి చట్టపరంగా శిక్ష అనుభవిస్తారో లేదో కానీ.. అసలు మానసిక శిక్ష మాత్రం ఖచ్చితంగా పడుతుంది. ఈ పాయింట్ ను ఆర్కే మిస్సయ్యారు.