తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకూ ఆధారాలు సేకరించిన పోలీసులు ఇప్పుడు బాధితుల స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారు. నేరుగా ట్యాపింగ్ చేసినట్లుగా ఆధారాలు లేకపోయినా.. సర్వీస్ ప్రోవైడర్లకు మావోయిస్టు సానుభూతిపరుల పేరుతో నెంబర్లు ఇచ్చి చేసిన ట్యాపింగ్ ఆధారాలు బయటపడటంతో పోలీసులు దూకుడు చూపిస్తున్నారు. ప్రణీత్ రావు మొత్తం ట్యాపింగ్ వ్యవహారాల గుట్టు విప్పుతున్నట్లుగా చెబుతున్నారు.
ఈ క్రమంలో ఫోన్లు ట్యాప్ అయిన నెంబర్లకు చెందిన వారిని పోలీసులు పిలిచించి ప్రశ్నిస్తున్నారు. వారి వద్ద నుంచి స్టేట్ మెంట్లు తీసుకుంటున్నారు. బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావుతో పాటు చాలా మంది నేతల్ని పిలుస్తున్నారు. అలాగే ఇతర నేతలకు సన్నిహితంగా ఉన్న వారి నెంబర్లు ట్యాపింగ్ జాబితాలో ఉంటే వారినీ పిలుస్తున్నారు. ఇందులో ఏపీకి చెందిన వారి పేర్లు ఉంటాయా.. వారిని పిలుస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.
వైఎస్ షర్మిల ఇప్పటికే తాను స్టేట్ మెంట్ ఇస్తానని ప్రకటించారు. ఈటల రాజేందర్ ట్యాపింగ్ నిజమని తన వద్ద ఉన్న సాక్ష్యాలు ఇచ్చారు. కఠిన చర్యుల తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంలో పోలీసులు తదుపరి తీసుకోబోయే చర్యలపై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసు వ్యవహారంలో సంచలన విషయాలు బయట పెట్టి.. అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.