ఉమ్మడి కడప జిల్లాలో జగన్ రెడ్డి చిచ్చు పెట్టుకుంటున్నారు. అసలే కంచుకోటలు బద్దలై.. మళ్లీ కోటలు కట్టడం సాధ్యమో కాదో తెలియని పరిస్థితులు ఉంటే.. తొందరపడి ఇతర నేతలకు టిక్కెట్ హామీలు ఇచ్చి పార్టీలో చేర్చుకుంటున్నారు. దాంతో ఇప్పటి వరకూ లాయల్ గా ఉన్న వారు.. జగన్ రెడ్డి వెన్నుపోటు పొడుస్తున్నారని.. తాము కూడా అదే పని చేసేందుకు రెడీ అవుతున్నారు.
సుగవాసి బాలసుబ్రహ్మణ్యం అనే లీడర్ కు రాయచోటి టిక్కెట్ ఆఫర్ ఇచ్చి పార్టీలో చేర్చుకుంటున్నారు జగన్. ఆయనకు అక్కడ టీడీపీలో టిక్కెట్ దక్కదని స్పష్టత ఉంది. గత ఎన్నికల్లో ఆయన అక్కడ గెలవలేదని.. రాంప్రసాద్ రెడ్డికి చాన్స్ ఇచ్చారు. ఆయనకు అన్యాయం చేయకుండా రాజంపేట టిక్కెట్ ఇచ్చారు. సాధారణంగా బలిజల సీటు అయిన రాజంపేట అసెంబ్లీలో కూడా ఆయన గెలవలేకపోయారు. వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు వచ్చినప్పటికీ.. టీడీపీ నేతల్ని కలుపుకోలేకపోవడంతో ఓడిపోయారు.
అయితే ఆయన టార్గెట్ రాయచోటినే. తనకు అక్కడే సీటు ఇస్తే వైసీపీలో చేరేందుకు సిద్ధమని చెప్పడంతో జగన్ అంగీకరించారు. రాయచోటిలో జగన్ మిత్రుడు శ్రీకాంత్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చినట్లయింది. నిజానికి గత ఎన్నికల్లోనే ఆయనకు టిక్కెట్ లేదని జగన్ చెప్పినా పట్టుబట్టి ఎలాగోలా తెచ్చుకున్నారు. ఇప్పుడు అక్కడ చాలా మంది రేసులో ఉన్నారు. రెడ్డప్పగారి రమేష్ రెడ్డి, జైల్లో ఉన్న ధనుంజయ్ రెడ్డి కూడా రేసులో ఉన్నారు.
రాయచోటి అసెంబ్లీ ఇవ్వబోమని.. రాజంపేట పార్లమెంట్ ఇస్తారని కొంత మంది చెబుతున్నారు. అంటే మిథున్ రెడ్డిని డంప్ చేస్తారా?. పెద్దిరెడ్డి ఫ్యామిలీని వదిలేస్తారా ?. జగన్ రెడ్డి మనస్థత్వం గురించి తెలిసిన ఎవరూ ఆయన టికెట్ హామీ ఇస్తే.. గ్యారంటీ ఉంటుందని నమ్మరు. కానీ కొంత మంది ఆశపడుతూంటారు.