మసాలా న్యూస్ అనిపించగానే.. అందులో నిజా నిజాలు ఉన్నాయా .. లేదా అని పరిశీలించే సమయం కూడా ఎవరికీ ఉండటం లేదు. ముఖ్యంగా ఘనత వహించిన మీడియాకూ ఉండటం లేదు. ఆ మసాలా న్యూస్ లో నిజం లేకపోతే ఆ బాధితుల జీవితంపై పడే ప్రభావాన్ని కనీసం ఆలోచించే తీరికే ఉండటం లేదు. అలా ఎంతో మంది బాధితులుగా మిగిలిపోతున్నారు. తాజాగా గోదావరి జిల్లాలలో ఓ మహిళపై మీడియా ఇలాంటి ముద్రే వేసింది.
ఎవరో ముగ్గురు వ్యక్తులు రెండు జిరాక్స్ ఫోటోల్ని.. ముఖానికి మాస్కులేసుకుని వచ్చి ఒకామె పన్నెండుపెళ్లిళ్లు చేసుకుందని.. మోసం చేసిందని ఆరోపించారు. కనీసం క్రాస్ చెక్ చేయకుండా.. ఆ మహిళ ఫోటోలతో సహా ఘనత వహించిన మీడియా చానళ్లు ప్రసారం చేశాయి. అవే చెప్పాం.. ఇక కథలు కథలుగా రాసే డిజిటల్ మీడియా ఊరుకుంటుందా?. ఇప్పుడా మహిళ అందర్నీ ప్రశ్నిస్తోంది. తాను పెళ్లి చేసుకున్నానని ప్రసారం చేసిన మీడియా..తన పన్నెండు మంది భర్తల్ని చూపించాలని డిమాండ్ చేస్తోంది.
నిజానికి ఆ మహిళ ఓ పాస్టర్ మోసానికి బలయ్యానని అంటోంది. పెళ్లి చేసుకుని పిల్లలున్న పాస్టర్ తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఇదేమని ప్రశ్నించి కేసు పెడతామన్నందుకు.. ఆ పాస్టర్ మహిళ జీవితాన్ని నాశనం చేసి.. తన రెండో భార్యగానే ఉండాలనే కుట్ర పన్ని ఇలా 12 పెళ్లిళ్లు అని ప్రచారం చేయించాడు. ఆ ట్రాప్ లో మీడియా పడింది. మీడియాను వాడుకున్న పాస్టర్.. ఆ మహిళ జీవితాన్ని మీడియా సాయంతో నాశనం చేశాడు. ఇప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు?
ఆ మహిళ మీడియాపై న్యాయపోరాటం చేయలేదు. సామాన్యమైన మహిళ . కానీ ఘనత వహించిన మీడియాకు కనీస బాధ్యత ఉండక్కరలేదా ?. పోలీసులు చెప్పేదాకా అయినా ఉండొద్దా ?. ఇప్పుడా మహిళ జీవితంపై పడిన నిందను ఎవరు తుడుస్తారు ? మీడియా తుడవగలదా ?