కల్వకుంట్ల కవిత తన రాజకీయం తాను చేస్తున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారో పట్టించుకోకుండా.. తన వెంట ఉన్న పిడికెడు మందితోనే రాజకీయాలు చేస్తున్నారు. అయితే ఆమె తెలివిగా నా పార్టీ బీఆర్ఎస్.. మా పార్టీ చీఫ్ కేసీఆర్.. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు. కానీ ఆమె రాజకీయాలు మాత్రం జాగృతి తరపున చేసుకుంటున్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం వచ్చే నెలలో రైల్ రోకోకు కూడా పిలుపునిచ్చారు.
ఆ రైల్ రోకోను విజయవంతం చేయడం తన ఒక్కరి వల్ల సాధ్యం కాదు కాబట్టి ఇతర పార్టీలను రంగంలోకి తేవాలని ప్రయత్నిస్తున్నారు. బీసీ ఉద్యమ సంఘాలను కదిలించేందుకు ఆర్ కృష్ణయ్యతో చర్చలు జరిపారు. ఆయన మద్దతు ప్రకటించారు. బీసీ ఎజెండా కాబట్టి ఖచ్చితంగా మద్దతు ప్రకటిస్తారు. ఆయన కానీ ఆయన అనుచరులు కానీ పాల్గొనరు. కవిత..కమ్యూనిస్టు పార్టీల నేతల్ని కూడా కలిసి మద్దతు పలికారు. ఏదైనా నిరసన చేపట్టాలంటే.. కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు సీరియస్ నెస్ చూపిస్తారు. అందుకే వారినికూడా రంగంలోకి దింపాలని కవిత ప్లాన్ చేసుకున్నారు.
అన్నీ బాగున్నాయి కానీ మీ పార్టీ బీఆర్ఎస్ ఈ రైల్ రోకోలో పాల్గొంటుందా అంటే.. కవిత సమాధానం చెప్పలేకపోతున్నారు. పోనీ ఆహ్వానిస్తారా అంటే దానిపైనా ఎలాంటి సంకేతాలు లేవు. కేసీఆర్ మాట్లాడటం లేదు. ఫామ్ హౌస్ కి వెళ్తే గేట్లు తెరుస్తారో లేదో తెలియదు. కేటీఆర్ కూడా కలవరు. హరీష్ రావుతో అసలు మాటల్లేవు. ఇలాంటి సందర్భంలో కవితకు బీఆర్ఎస్ సపోర్టు చేసే అవకాశాల్లేవు. ఆ రైల్ రోడ్ తర్వాత బీఆర్ఎస్, కవిత మధ్య అంతరం మరింత పెరగనుందని అనుకోవచ్చు.