మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు బనకచర్లకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. అది ఏపీకి నష్టదాయకం అంటున్నారు. అంతే కాదు తనలాగే రిటైరైన వాళ్లతో ఓ సంఘాన్ని కూడా ఏర్పాటు చేసి.. బనకచర్లపై ప్రజల్లో చర్చ జరగాలని డిమాండ్ చేస్తున్నారు.
పోలీస్ ఆఫీసర్ గా ఉండి ఐదు సంవత్సరాల పాటు డ్యూటీ చేయలేక.. జగన్ ప్రతీకారేచ్ఛకు బలైపోయిన ఆయన.. రిటైరైన తర్వాత యాక్టివ్ గా ఉంటున్నారు. జగన్ బాధితుల్ని కలుస్తూ భరోసా ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాను రాజకీయాల్లోకి వస్తానన్నారు. పార్టీ ద్వారా వస్తారా.. సొంత పార్టీ పెడతారా అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. కానీ కొన్ని అంశాలపై మాత్రం తనదైన వాయిస్ వినిపిస్తున్నారు. విచిత్రంగా ఏపీకి గేమ్ ఛేంజర్ అని.. చంద్రబాబు చెబుతున్న బనకచర్ల ప్రాజెక్టును ఆయన వ్యతిరేకిస్తున్నారు.
ఆ ప్రాజెక్టు అత్యంత ఖర్చుతో కూడుకున్నదని.. రిటర్న్స్ తక్కువగా ఉంటాయని ఏబీవీ వాదన. ఒక్కో ఎకరానికి యాభై వేల ఖర్చు సగటున ప్రాజెక్టుకు వస్తుందని..దాని వల్ల ఉపయోగం ఉండదని అంటున్నారు. అలాగే దానికి స్టోరేజీ కెపాసిటీ కూడా లేదని అంటున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మిస్తే.. కృష్ణా జలాల్లో రెండు వందల టీఎంసీల వాటాను కోల్పోవాల్సి వస్తుందని అంటున్నారు.
అంతే కాదు బనకచర్లను జగన్ సమర్థించడాన్ని ఏబీవీ మరో కారణంగా చెబుతున్నారు. ఈ ప్రాజెక్టును మేఘాకు కట్టబెట్టడానికి గతంలో జగన్ ప్రయత్నించారని ఇప్పుడు మేఘాకే ప్రాజెక్టు వస్తుంది కాబట్టి జగన్ వ్యతిరేకించడం లేదని అంటున్నారు. గతంలో పట్టిసీమ ప్రాజెక్టుపై జగన్ ఎంత రచ్చ చేశారో చూశాం కదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఏబీవీ చెబుతున్నదాంట్లో ఎంత నిజం ఉందో కానీ..బనకచర్లను వ్యతిరేకించడం మాత్రం ఆసక్తికరంగా మారింది.