క్రేజ్ రావడం లక్. కానీ వచ్చిన క్రేజ్ను నిలబెట్టుకోవాలంటే తెలివి ఉండాలి. ప్రతి అడుగు జాగ్రత్త వేయాలి. కథను బేరీజు వేసుకునే టాలెంట్ ఉండాలి. రష్మిక మందన్న ఈ విషయంలో నాలుగు ఆకులు ఎక్కువే తెలుసుకుంది. ఆమె కథల ఎంపిక అదిరిపోతుంది. కమర్షియల్ సినిమాలు చేస్తూనే బలమైన స్క్రిప్ట్లను ఎంచుకుంటుంది. ఎప్పటికప్పుడు జానర్స్ మార్చేస్తుంది.
యానిమల్ లాంటి చిత్రం చేసిన వెంటనే ఛావా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి పూర్తి భిన్నమైన కుబేర చేసింది. త్వరలో ఆమె నుంచి ది గర్ల్ఫ్రెండ్ అనే ఓ ప్రేమకథ రాబోతోంది. ఈలోగా మరో విభిన్నమైన సినిమాకు సైన్ చేసింది.
ఇది ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా. హను రాఘవపూడి శిష్యుడు రవీంద్ర పుల్లే డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. అజయ్, అనిల్ సయ్యపురెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాకు ‘మైసా’ అనే టైటిల్ పెట్టారు.
ఫస్ట్లుక్ “నెవర్ బిఫోర్” అనే చెప్పాలి. చీర, ముక్కుపుడక, రక్తపు మరకలు, చేతిలో గట్టిగా పట్టుకున్న ఆయుధం… ఇలా ఓ పవర్ఫుల్ లుక్లో కనిపించింది రష్మిక. గోండు తెగల ప్రపంచాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిన ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఇప్పటివరకు టచ్ చేయని ఓ పాయింట్తో కథ రాసుకున్నారట. త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తారు.