కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఆదివారం నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన పసుపుబోర్డు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రధానమైన హామీ ఈ పసుపుబోర్డు. గత ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ ప్రకటించి.. వెంటనే కేంద్రం నుంచి ఉత్తర్వులు రిలీజ్ చేయించారు. ఇప్పుడు కార్యాలయం ప్రారంభోత్సవానికి అమిత్ షాను ఆహ్వానించారు.
ప్రత్యేకమైన ఇతర కార్యక్రమాలేవీ లేవు కానీ.. ధర్మపురి అర్వింద్ తన తండ్రి డీఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి..దాన్ని అమిత్ షాతో ఆవిష్కరింప చేస్తున్నారు. ఇది రాజకీయవర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే ధర్మపురి శ్రీనివాస్ అలియాస్ డీఎస్ ఎప్పుడూ బీజేపీలో లేరు. కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేతగా ఉన్నారు. రెండు సార్లు పీసీసీ చీఫ్ గా చేశారు. మంత్రిగా చేశారు. కాంగ్రెస్ దగ్గర ఏమీ లేదని అనుకున్న తర్వాత ఆయన బీఆర్ఎస్ లో చేరారు. అక్కడ రాజ్యసభ సీటు ఇచ్చారు. అయితే ఆయన తర్వాత మళ్లీ కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. కానీ అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు.
ఆరోగ్యం క్షీణించడంతో ఇక ఎలాంటి రాజకీయాలు చేయలేదు. సుదీర్ఘ కాలం అనారోగ్యంతో బాధపడి చనిపోయారు. ఆయన కుమారుడు ధర్మపురి అర్వింద్ కాంగ్రెస్ పార్టీతో కాకుండా బీజేపీతో రాజకీయ పయనం ప్రారంభించారు. ఇప్పటికి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. తండ్రి సిద్ధాంతాలు వేరైనప్పటికీ.. బీజేపీతో ఎలాంటి సంబంధం లేనప్పటికీ.. అమిత్ షాతో తండ్రి విగ్రహాన్ని ఆవిష్కరింప చేయడం ఆయన రాజకీయ చాతుర్యం అంటున్నారు. డీఎస్ పై ఇప్పుడు కాషాయ ముద్ర పడుతుందని అంటున్నారు.