బీఆర్ఎస్ పార్టీకి చెందిన న్యూస్ చానల్ టీ న్యూస్ లో పని చేస్తున్న స్వేచ్చ వోటార్కర్ అనుమానాస్పద స్థితిలో చనిపోవడం మీడియా రంగంలో సంచలనం సృష్టించింది. ప్రతిభావంతమైన జర్నలిస్టు, యాంకర్గా పేరు తెచ్చుకున్న స్వేచ్చ గతంలో టీవీ9లోనూ పని చేశారు. తర్వాత అక్కడి నుంచి టీ న్యూస్ లో చేరారు. తెలంగాణ ఉద్యమకారిణిగా కూడా గుర్తింపు పొందారు.
స్వతంత్ర భావాలున్న స్వేచ్చది వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకునేంత బలహీన మనస్థత్వం కాదని ఆమె స్నేహితులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. భర్తతో విబేధాలు వచ్చి విడిపోవడంతో కుమార్తెను సొంతంగానే చదివించుకుంటూ జీవిస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ముందుగా కుమార్తె జీవితం గురించి ఆలోచించి ఉంటారని స్నేహితులు అంటారు. స్వేచ్చ ఉరి వేసుకున్న ఫోటోలో వైరల్ అయ్యాయి. కాళ్లు నేలకు ఆనుతున్నట్లుగా ఉన్నాయి. అందుకే ఏదో జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.
పోలీసులు ఆత్మహత్యగానే భావిస్తున్నారు. ఏదైనా లీడ్ దొరికితే అనుమానాస్పద మృతి కేసుగా మార్చి దర్యాప్తు చేసే అవకాశాలు ఉన్నాయి. స్వేచ్చ ఓ అపార్టుమెంట్ పెంట్ హౌస్ లో నివసిస్తున్నారు. అందులో ఎవరెవరు ఉంటారు ?. పని చేసే చోట ఏమైనా సమస్యలు ఉన్నాయా ? అన్న విషయాలను ఆరా తీసే అవకాశం ఉంది. ప్రతిభావంతమైన తెలంగాణ జర్నలిస్టు..పైగా మహిళా జర్నలిస్టు ఇలా అర్థంతరంగా చనిపోవడం చాలా మందిని దిగ్భ్రాంతికి గురి చేసింది.