టీ న్యూస్ చానల్ యాంకర్ స్వేచ్ఛ మృతిపై వివాదం పెరుగుతోంది. తన కుమార్తె మృతికి పూర్ణచందర్ అనే వ్యక్తి కారణం అని స్వేచ్ఛ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వేచ్ఛ చనిపోయినప్పటి నుంచి పరారీలో ఉన్న పూర్ణచందర్ ఓ లేఖను విడుదల చేశారు. ఐదు పేజీలతో ఉన్న ఆ లేఖలో సేచ్ఛకు తాను సంతోషాన్ని ఇచ్చానని.. కానీ ఆమె తల్లిదండ్రులే సూటిపోటి మాటలని ఆత్మహత్య చేసుకునేలా చేశారని రివర్స్ లో ఆరోపించాడు.
ప్రతి రెండేళ్లకోసారి ఓ వ్యక్తిని తీసుకు వచ్చి ఇతనే మీ అల్లుడు అని చెబుతూంటే.. తమ పరువు పోతుందని తండ్రి.. స్వేచ్ఛను కించ పరిచేలా మాట్లాడాడని పూర్ణచందర్ అంటున్నాడు. పుట్టిన వెంటనే స్వేచ్ఛను బంధువులకు ఇచ్చి వారు జనశక్తిలో పని చేసేందుకు వెళ్లిపోయారని.. స్వేచ్ఛకు చిన్న తనం నుండి ఎలాంటి ప్రేమ అందలేదని పూర్ణచందర్ చెప్పుకొచ్చాడు . రెండు సార్లు పెళ్లిళ్లు చేసుకున్నా రెండూ ఫెయిలయ్యాయని తాను ఆమెకు ఆనందాన్ని ఇచ్చానన్నారు. సహజీవనం చేస్తున్నామని.. స్వేచ్ఛ బిడ్డను తన బిడ్డగానే పెంచుతున్నానని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ బలవంతంగా ప్రాణాలు తీసుకుంటే ఏదైనా సూసైడ్ నోట్ రాసి ఉండేవారు కానీ.. అలాంటిదేమీ పోలీసులకు చిక్కలేదు. అందుకే మృతిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ను స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తున్నారు. ఈ లోపు తల్లిదండ్రులు పూర్ణచందర్ పై.. పూర్ణచందర్.. ఆమె తల్లిదండ్రులపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ కేసులో మిస్టరీని పోలీసులు వెలికి తీయాల్సి ఉంది.