బాధ్యత లేని రాజకీయ పార్టీలు కార్యకర్తల జీవితాలతో ఆడుకుంటాయి. వారిని ముందు పెట్టి చట్ట వ్యతిరేక పనులు చేయిస్తాయి. ఆ కార్యకర్తలు జైలు పాలవుతారు. వారి కుటుంబాలు బాధలు పడతాయి. కానీ ఎవరు రెచ్చగొట్టారో వారు మాత్రం సుఖంగా ఉంటారు. వారికి రాజకీయ లాభాలు కలుగుతాయి. న్యాయసాయం మొదట్లో చేస్తారు. కానీ కేసులు పూర్తయ్యే వరకూ కోర్టుల చుట్టూతిరగాల్సింది మాత్రం కార్యకర్తలే.
మహాన్యూస్ పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడానికి కార్యకర్తల్ని సమీకరించారు. మేమున్నామని చెప్పి వెళ్లి దాడి చేయించారు. వారిని రెచ్చగొట్టేలా కొంత మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇతర దేశాల్లో ఉంటూ..ఇక్కడి కార్యకర్తల్ని రెచ్చగొట్టారు. ఇప్పుడు ఆ కార్యకర్తలు సోషల్ మీడియా హ్యాండిల్స్ ను ప్రైవేటులో పెట్టుకున్నారు.కానీ ఇక్కడ వారి వల్ల చాలా మంది జైలుకెళ్తున్నారు. ఇప్పుడు వారి కోసం పార్టీ తరపున న్యాయ సాయం చేయవచ్చు కానీ.. కోర్టుల చుట్టూ తిరగాల్సింది మాత్రం దాడులు చేసిన వాళ్లే.
రాజకీయ పార్టీకి కార్యకర్తలు బలం. వారిని కాపాడుకోవాలి. ప్రజాస్వామ్యయుతంగా వారి బలాన్ని ఉపయోగించుకోవాలి. కానీ దారి తప్పిన రాజకీయ పార్టీలు.. వారితో తప్పుడు పనులు చేయిస్తే.. వారు కేసుల పాలవుతారు. తమ రాజకీయం కోసం వారి జీవితాల్ని నాశనం చేసినట్లవుతుంది కానీ బాగు చేసినట్లుగా కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇలాంటి దాడులు చేయడం వేరు. అది రాజకీయం కోసం కాదు. కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా రాజకీయం కోసం చేస్తున్నారు. దాని వల్ల నష్టపోయేది కార్యకర్తలే.
రాజకీయంగా తిరుగుతూ.. పార్టీ కార్యాలయాల దగ్గరే జీవితాలను గడిపేవారు కూడా భవిష్యత్ లో పరిణామాలను అంచనా వేసుకోవాలి. తమ జీవితాలను పణంగా పెట్టే పార్టీల కుట్రల్ని అర్థం చేసుకోవాలి. ఏదైనా ప్రజాస్వామ్య రాజకీయంలో పార్టీ కోసం అండగా ఉండటం వేరు.. దాడులు .. దొమ్మీలు చేయడం వేరు. ఇలాంటివి పార్టీ ముసుగులో చేయమని ఒత్తిడి చేస్తే కార్యకర్తలు సర్దుకోవడం మంచిది. లేకపోతే కేసులు మాత్రమే మిగులుతాయి.