‘ఈ నగరానికి ఏమైంది’ విడుదలై ఏడేళ్లయ్యింది. ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ వుంది. ఇప్పటికీ రిపీట్ మోడ్ లో చూస్తూనే ఉంటారు. పెళ్లి చూపులు లా ట్రెండ్ సెట్టర్ కాదు కానీ, తరుణ్ భాస్కర్ బెస్ట్ వర్క్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఇటీవల రీ రిలీజ్ చేస్తే – యూత్ అంతా థియేటర్లకు క్యూ కట్టారు. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని ఎప్పటి నుంచో అనుకొంటున్నారు. ఇప్పటికి అది సెట్ అయ్యింది. ‘ఈఎన్ఈ – రిపీట్’ పేరుతో ఈ సినిమాకు సీక్వెల్ తీస్తున్నారు. ఓ సీక్వెల్ కు ఇంగ్లీష్ అక్షరాలతో టైటిల్ పెట్టడం వెరైటీగా వుంది. సురేష్ బాబు తో పాటుగా సృజన్, సందీప్ నాగిరెడ్డి నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. విశ్వక్సేన్తో పాటు మిగిలిన బ్యాచ్ అభినవ్ గోమట్టం, సాయి సుశాంత్ రెడ్డి, వెంకటేష్ కాకమాను కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈరోజు సీక్వెల్ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ‘ఏళ్ల నాటి శనిపోయింది – కన్యారాశికి టైమ్ వచ్చింది’ అంటూ సీక్వెల్ ని ఘనంగా మొదలెట్టారు. ఈ సందర్భంగా ఈ చిన్న వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. అది కాస్త వెరైటీగా వుంది.
వివేక్ సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా సాగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ మొదలెడతారు. ఇందులో ఇద్దరు కథానాయికలకు చోటుంది. వాళ్లెవరన్నది త్వరలో ప్రకటిస్తారు. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో కథనం, క్యారెక్టరైజేషన్లు, డైలాగులు కొత్త ట్రెండ్ ని సృష్టించాయి. చాలా సహజంగా సన్నివేశాల్ని తెరకెక్కించారు తరుణ్ భాస్కర్. వాటికి మించిన వినోదం, సహజత్వం ఈ కథలో ఉంటుందని చిత్రబృందం నమ్మకంగా చెబుతోంది. తరుణ్ భాస్కర్ కూడా దాదాపు నాలుగేళ్లుగా ఈ కథపై వర్క్ చేస్తున్నారు. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.