ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో దర్యాప్తు ఎవరూ ఊహించనంత లోతుగా వెళ్తోంది. చాలా పకడ్బందీగా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే స్కాం ఎలా జరిగిందో.. డబ్బులు ఎలా రూట్ అయ్యాయో మొత్తం తెలుసుకున్న సిట్.. ఇప్పుడు అందులో పాత్రధారులు, సూత్రధారుల్నే కాదు.. డమ్మీలుగా వాడుకున్న అధికారులతో కలిపి డాట్స్ కలుపుతోంది. అసలు కింగ్ పిన్ దగ్గరకు కేసును చేరుస్తోంది.
మొత్తం చెప్పేసిన రజత్ భార్గవ
సీనియర్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ. కొన్ని నెలల కిందటే రిటైర్ అయ్యారు. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు ఆయన చాలా సిన్సియర్. పెట్టుబడులను తీసుకువచ్చేందుకు చంద్రబాబు ఆయనను పక్కన పెట్టుకునే ఎక్కువ దేశాలకు తిరిగేవారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆయనను ముందు పెట్టి లిక్కర్ స్కాం చేశారు. ఉన్నతాధికారిగా ఆయన పాత్ర పరిమితం చేశారు. ఇప్పుడు అదంతా సిట్ విచారణలో చెప్పారు. బయటకు తెలియకపోయినా అసలు గుట్టుకు సంబంధించిన మొత్తం క్లూస్ ఇచ్చేశారని భావిస్తున్నారు.
నేడు విజయసాయిరెడ్డి వంతు
లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డి ఐదో నిందితుడిగా ఉన్నారు. కానీ తనకు తాను విజిల్ బ్లోయర్ గా చెప్పుకుంటున్నారు. దానికి సార్థకత రావాలంటే.. ఇంకా చాలా చెప్పాలని సిట్ అధికారులు సంకేతాలు పంపారు. ఇప్పటి వరకూ విజయసాయిరెడ్డి అంతా రాజ్ కేసిరెడ్డి చేశారని అంటున్నారు కానీ. ..ఆ డబ్బంతా జగన్ రెడ్డికి చేరిందంని మాత్రం చెప్పడం లేదు. అలాగని చేరలేదని కూడా చెప్పడం లేదు. తనకు తెలియదంటున్నారు. నేరుగా కాకపోయినా.. కొన్ని క్లూస్ ఆయన దర్యాప్తు అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే ఆయన కూడా జైలుకెళ్లే పరిస్థితి ఉంటుంది. అలాంటిది రాకూడదనే విజయసాయిరెడ్డి ఇప్పుడు కిందా మీదా పడుతున్నారు. శనివారం విచారణలో సిట్ అధికారులకు కావాల్సిన సమాచారాన్ని ఇస్తారని భావిస్తున్నారు.
లిక్కర్ స్కామ్ సొమ్ము జప్తు – కానీ ఇంకా ఎంతో ఉంది !
రూ.32 కోట్ల వరకూ లిక్కర్ స్కామ్ సొమ్మును జప్తు చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. కానీ జరిగిన స్కాంలో ఇది చాలా చిన్న మొత్తం. వందల కేజీల బంగారం, అంతకు మించి షెల్ కంపెనీల్లో నగదు. భారతి సిమెంట్స్, పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ లోకి చేరిన నగదు, ఇంకా డెన్లలలో మిగిలి ఉన్న నోట్ల కట్టల బండిల్స్ ను సిట్ స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. అవి ఎక్కడ ఉన్నాయో కనిపెట్టి బయటకు తీసుకు రావడం చాలా అవసరం. అవి దొరికితే చాలు మిగతా అంతా ప్రజల చేతుల్లోకి వెళ్లిపోతుంది.