తెలంగాణ జాగృతిని ముందుగా పల్లె పల్లెకు తీసుకుపోయి ఆ తర్వాత రాజకీయ పార్టీగా ప్రకటించాలన్న ఆలోచనలో కవిత ఉన్నారు. అయితే ఇప్పుడు ఆమె కేసీఆర్ ఫోటోను ఉపయోగించుకోవాలా వద్దా అన్న డైలమాలో ఉన్నారు. కేసీఆర్ ..బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్. ఆయన ఫోటోను తాను జాగృతిని రాజకీయ పార్టీగా మార్చిన తర్వాత ఆయన ఫోటోను ఉపయోగించుకోవడం సముచితంగా ఉండదని నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే తమ పార్టీకి ప్రొఫెసర్ జయశంకర్ ను ఆదర్శంగా తీసుకోవాలని నిర్ణయించారు.
కవిత నియోజకవర్గాల వారీగా పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తెలంగాణలో ఎన్నికలకు సమయం ఉంది. స్థానిక ఎన్నికలపై స్పష్టత లేదు. అవి వచ్చినా స్థానిక నాయకత్వాన్ని ఇంకా సిద్ధం చేసుకోలేదు కాబట్టి పోటీ చేయకపోవచ్చు. ఆ ఎన్నికలు పార్టీ రహితంగానే జరుగుతాయి. అందుకే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపైనే ఫోకస్ చేసి.. ముందుగా జాగృతిని బలోపేతం చేయాలనుకుంటున్నారు. పర్యటనలతో ఎక్కడికక్కడ స్థానిక నాయకత్వానికి బాధ్యతలు ఇచ్చి క్యాడర్ ను సిద్ధం చేసుకునే ఆలోచనలో ఉన్నారు.
తెలంగాణ రెండో దశ ఉద్యమాన్ని నడిపించింది కేసీఆరే ఆయినా.. కేసీఆర్ నడిచింది మాత్రం ప్రొఫెసర్ జయశంకర్ సహాలతోనే. తెలంగాణ సమాజం అంతా జయశంకర్ సార్ అని పిలుచుకుంటుంది. జాగృతిని ప్రారంభించాలని చెప్పిందే ప్రొ.జయశంకర్ అని కవిత చాలా సార్లు చెప్పారు. అందుకే ఆయన ఫోటోతోనే తన రాజకీయాలను చేయాలని కవిత నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.