ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనాభా నియంత్రణకు వ్యతిరేకంగా, సంతానోత్పత్తిని ప్రోత్సహించాలని చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు, కొన్ని వర్గాల నుంచి ట్రోల్స్కు దారితీస్తున్నాయి. అయితే, ఈ విమర్శలను ఏమాత్రం పట్టించుకోకుండా ఆయన తన పంథాలోనే ముందుకు సాగుతున్నారు. చంద్రబాబు కేవలం ప్రస్తుత రాజకీయాల కోసమే కాకుండా, రాబోయే రెండు మూడు దశాబ్దాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చేస్తున్న ఈ హెచ్చరిక వెనుక బలమైన సామాజిక, ఆర్థిక కారణాలు కనిపిస్తున్నాయి.
చంద్రబాబు రేపటి ఎన్నికల కోసం కాదు.. భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తారు!
రాజకీయ నాయకులు సాధారణంగా వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తారు, కానీ చంద్రబాబు నాయుడు వచ్చే తరం గురించి ఆలోచిస్తున్నారని ఆయన మద్దతుదారులు వాదిస్తున్నారు. జనాభా పెంచాలన్న ఆయన పిలుపుపై ఇప్పుడు ఎన్ని ట్రోల్స్ వస్తున్నా, ఆయన మాత్రం తన వాదనను గట్టిగా వినిపిస్తున్నారు. ఇప్పుడు పుట్టే పిల్లలకు ఓటు హక్కు వచ్చే సమయానికి, అంటే మరో 18 ఏళ్ల తర్వాత, చంద్రబాబు రాజకీయాల్లో ఉండకపోవచ్చు. కానీ, అప్పటికి ఆంధ్రప్రదేశ్ ఎదుర్కోబోయే వృద్ధాప్య సమస్య తీవ్ర స్థాయికి చేరుతుందన్నది చేదు నిజం. ఈ ముప్పును ముందే పసిగట్టిన నాయకుడిగా చంద్రబాబు తన బాధ్యతను నిర్వర్తిస్తున్నారు.
అంతర్జాతీయ అనుభవాలు – ఏపీకి హెచ్చరిక
చంద్రబాబు చెబుతున్న మాటలు కేవలం రాజకీయ నినాదాలు కావు. ప్రస్తుతం జపాన్, చైనా, ఇటలీ , దక్షిణ కొరియా వంటి దేశాలు తీవ్రమైన జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆ దేశాల్లో యువశక్తి తగ్గిపోయి, వృద్ధుల సంఖ్య పెరగడంతో దేశ ఆర్థిక వ్యవస్థలు కుంటుపడుతున్నాయి. జపాన్ వంటి దేశాలు ఇప్పుడు సంతానోత్పత్తి కోసం భారీ ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నా, ఆశించిన ఫలితం రావడం లేదు. సరిగ్గా ఇదే పరిస్థితి రేపు ఆంధ్రప్రదేశ్కు రాకూడదనేది చంద్రబాబు ఆలోచన. ‘తప్పు జరిగిన తర్వాత సరిదిద్దుకోవడం కంటే, ముందే మేల్కొనడం మేలు అనే సిద్ధాంతాన్ని ఆయన ఫాలో అవుతున్నారు.
యువశక్తి లేని రాష్ట్రం.. సంక్షోభానికి నిచ్చెన!
ప్రస్తుతం ఏపీలో జననాల రేటు దేశ సగటు కంటే తక్కువగా ఉంది. ఇదే ధోరణి కొనసాగితే, భవిష్యత్తులో వ్యవసాయం చేయడానికి, పరిశ్రమల్లో పని చేయడానికి యువత దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. శ్రామిక శక్తి లేని రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీస్తుంది. చంద్రబాబు తన గత పాలనలో జనాభా నియంత్రణకు పిలుపునిచ్చారు, ఎందుకంటే అప్పుడు వనరుల కొరత ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. పని చేసే చేతులు తగ్గిపోతుండటం రాష్ట్ర అభివృద్ధికి పెను సవాలుగా మారుతోంది. ఈ మార్పును గుర్తించి తన పాత విధానాన్ని మార్చుకోవడం ఆయన అడాప్టివ్ లీడర్షిప్ కు నిదర్శనం. రాబోయే కాలంలో పిల్లలు భారం కాదు.. సంపద అని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. దీనిని సీరియస్గా తీసుకోకపోతే, భవిష్యత్తు తరం చంద్రబాబు అప్పుడే చెప్పారు.. మనం వినలేదు అని పశ్చాత్తాపపడే రోజు వస్తుంది.
ట్రోల్స్ తాత్కాలికం.. సత్యం శాశ్వతం
సోషల్ మీడియాలో వచ్చే జోకులు, మీమ్స్ తాత్కాలికమే కావచ్చు, కానీ చంద్రబాబు లేవనెత్తిన అంశం అత్యంత తీవ్రమైనది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన ఇమేజ్ దెబ్బతింటుందని తెలిసినా, భవిష్యత్ తరాల మేలు కోసం ఈ అప్రజాకర్షక వాదనను ఆయన వినిపిస్తున్నారు. రేపు ఏపీ జనాభా సమీకరణాలు దెబ్బతిన్నప్పుడు, ఈనాటి చంద్రబాబు హెచ్చరికలే సరైనవని చరిత్ర చెబుతుంది. కాబట్టి, ఆయన అప్పీల్ను కేవలం రాజకీయ కోణంలో కాకుండా, సామాజిక బాధ్యతగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
