తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం హాట్ టాపిక్గా మారింది. విజయ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఆయన టీమ్లో కీలక పాత్ర పోషిస్తున్న కొందరు వ్యక్తులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యాపారవేత్తలు, మైనింగ్ రంగంలో ఉన్న వ్యక్తులు విజయ్కు అత్యంత సన్నిహితంగా ఉండటం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. వీరు కేవలం విజయ్కు మిత్రులు మాత్రమే కాదని, పార్టీని నడపడంలో, ఆర్థిక వనరులను సమకూర్చడంలో , ఎన్నికల వ్యూహాలను రచించడంలో కీలక సూత్రధారులని తమిళనాట విస్తృత ప్రచారం జరుగుతోంది.
అధవ్ అర్జున రెడ్డి – టీవీకేలో నెంబర్ 2
విజయ్ కేబినెట్లో కీలకమైన పబ్లిక్ వర్క్స్ మంత్రిగా ఉన్న అధవ్ అర్జున రెడ్డి ఇప్పుడు చర్చల్లో మొదటి వరుసలో ఉన్నారు. లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ అల్లుడైన అధవ్ అర్జున, వాస్తవానికి ఆంధ్రా మూలాలు ఉన్న వ్యాపార సామ్రాజ్యంతో సంబంధం కలిగి ఉన్నారు. రాజకీయ వ్యూహకర్తగా ప్రస్థానం మొదలుపెట్టి, డీఎంకే , వీసీకేలను దాటుకుని ఇప్పుడు విజయ్ క్యాబినెట్లో బలమైన నేతగా అవతరించారు. విజయ్ తర్వాత పార్టీలో అత్యున్నత నిర్ణాయక శక్తిగా ఆయన వ్యవహరిస్తుండటం, ఆయనపై వస్తున్న అవినీతి ఆరోపణలు ఇప్పుడు ప్రతిపక్షాలకు ఆయుధంగా మారాయి.
విష్ణువర్ధన్ రెడ్డి – విజయ్ వెనుక ఉన్న మైనింగ్ పవర్!
విజయ్ అంతరంగిక వర్గంలో అత్యంత కీలకమైన వ్యక్తిగా ఎర్రదొడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పేరు వినిపిస్తోంది. ఏపీలోని అన్నమయ్య జిల్లాకు చెందిన ఈయన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి సమీప బంధువు . చెన్నై కేంద్రంగా గత పదిహేనేళ్లుగా భారీ గ్రానైట్ క్వారీ వ్యాపారం నిర్వహిస్తున్న విష్ణువర్ధన్ రెడ్డి, విజయ్ పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని , ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. విజయ్ సినిమా డేట్స్ నుండి రాజకీయ మీటింగ్స్ వరకు అంతా ఈయన కనుసన్నల్లోనే జరుగుతుందనే చర్చ తమిళ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
వైఎస్ అనిల్ రెడ్డితో సాన్నిహిత్యంపై విమర్శలు
మరోవైపు, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి తో విజయ్కు ఉన్న సంబంధాలపై కూడా తమిళనాడులో విపరీతమైన వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. ఏపీలో మద్యం కుంభకోణం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులతో విజయ్ వంటి యువనేత సాన్నిహిత్యం ఏ రకమైన సందేశాన్ని ఇస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రాకు చెందిన వ్యాపారవేత్తలు తమిళనాడులోని సహజ వనరులపై కన్నేశారని, విజయ్ ద్వారా వారు తమ మైనింగ్ , ఇతర వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించుకోవాలని చూస్తున్నారనేది ఇతర పార్టీల ఆరోపణలు. ముఖ్యంగా తమిళ స్వయం ప్రతిపత్తి ని నమ్మే వర్గాలు ఈ బయటి వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ను జీర్ణించుకోలేకపోతున్నాయి. ఒకవేళ ప్రభుత్వ నిర్ణయాల్లో ఈ వ్యాపారవేత్తల ప్రమేయం పెరిగితే, విజయ్ నిర్మించుకున్న క్లీన్ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉంది.
