✍ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ తీసుకున్న అతిపెద్ద నిర్ణయం కొత్త జిల్లాల ఏర్పాటు… 10 జిల్లాల తెలంగాణ ను ఏకంగా 31 జిల్లాలకు పెంచారు… దసరా పండగ శుభసందర్భాన అట్టహాసంగా కొత్త జిల్లాలన్నింటిని ఏకకాలంలో ప్రారంభించారు.
? కొత్త జిల్లాలు ఏర్పడి ఇంకా నాలుగు నెలలు కూడా పూర్తికాలేదు. అప్పుడే ఈ జిల్లాల సంఖ్యను కుదించే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త వైరల్ గా మారింది.
? జిల్లాలను కుదించాలని కేంద్రం ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిందట. ప్రస్తుతం ఉన్న 31 జిల్లాలకుగాను 21 జిల్లాలుగా కుదించాలని సూచించిందట. దీనికి కేంద్రం చెబుతున్న కారణం… కేంద్ర సర్వీసు అధికారులను కేటాయించడం కష్టమవడమేనట.
? కొత్త జిల్లాలకు ఐఎఎస్, ఐపిఎస్ లతోపాటు ఇతర కేంద్ర సర్వీసు అధికారులను కేటాయించడం అసాధ్యమని అందువల్ల జిల్లాలను తగ్గించాలని చెప్పిందట. దీనిపై త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన ఇవ్వనుందట.
? అయితే ఈ జిల్లాల కుదింపు వార్త ఊహాగానాలా లేక విశ్వసనీయ సమాచారమా అనేది ఇంకా తెలియరాలేదు. కానీ, జిల్లాల ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం పెత్తనం ఉంటుందా… సెంట్రల్ గవర్నమెంట్ చెబితే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలను కుదించాల్సిందేనా….. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ వల్ల కేంద్రానికి వచ్చే ఇబ్బందులు ఏంటీ ..
✍ ఒకసారి పరిశీలిస్తే…
? అసలు జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అనేది పూర్తిగా రాష్ట్రాలకు సంబంధించిన అంశం… జిల్లాల ఏర్పాటు కుదింపు అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం. ఇందులో కేంద్రం జోక్యం అసలే ఉండదు. ఇందులో సర్వాధికారులు రాష్ట్రానివే.
? ఇక జిల్లాల పునర్ వ్యవస్థీకరణ వల్ల కేంద్రానికి వచ్చే ఇబ్బంది కూడా ఏమీ ఉండదు. తెలంగాణ కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న రాష్ట్రాలలో కూడా ఎక్కువ జిల్లాలే ఉన్నాయి.
? తెలంగాణలో ప్రతి 11 లక్షల జనాభాకు ఒక జిల్లా ఉండగా, మిజోరంలో 1.37 లక్షల జనాభాకు ఒక జిల్లా ఉంది. ఇక అరుణాచల్ ప్రదేశ్ లో కేవలం 67 వేల మందికి సగటున ఒక జిల్లా ఉంది.
తెలంగాణలో జిల్లాలు ఎక్కువగా ఉన్నాయని, దీని వల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులను కేటాయించలేమని అందువల్ల జిల్లాలను కుదించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కోరిందని నిన్నటి వరకు సోషల్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.
అయితే ఈ వార్తలు అవాస్తవమని తేలింది. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా జిల్లాల పునర్ వ్యవస్థీకరణ చేపట్టారు.
పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రభుత్వ పథకాలు ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు వీలుగా 10 జిల్లాలను ఏకంగా 31 జిల్లాలకు పెంచారు.
అయితే సోషల్ మీడియాలో జిల్లాల కుదింపు వార్తలు రావడంతో చాలా మంది అవాక్కైయ్యారు. ఈ విషయం కేంద్ర ప్రభుత్వం వరకు వెల్లడంతో దీనిపై వారు స్పందించాల్సి వచ్చింది.
“”తెలంగాణలో ప్రస్తుతం ఉనికిలో ఉన్న 31 జిల్లాలను కుదించాలని రాష్ర్టానికి లేఖ రాసినట్లు వస్తున్న వార్తలన్నీ నిరాధారమైనవని కేంద్ర హోంమంత్రిత్వశాఖలోని కేంద్ర-రాష్ట్ర సంబంధాల విభాగం(సీ-ఎస్), రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ (ఎస్ఆర్) విభాగాలకు చెందిన అధికారులు స్పష్టం చేశారు””.
? ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వానికి కొత్త జిల్లాల సంఖ్యను కుదించాల్సిందిగా ఎలాంటి లేఖను పంపలేదని తెలిపారు.
దీంతో జిల్లాల కుదింపు వార్తలకు తెరపడినట్లైంది.