భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ రేసు కేసులో 28వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించారు. గతంలో ఓ సారి ఏసీబీ ఈ కేసు అంశంలో ప్రశ్నించింది. అప్పట్లోనే మరోసారి పిలుస్తారని ప్రచారం జరిగింది కానీ ఎలాంటి నోటీసులు రాలేదు. కానీ హఠాత్తుగా ఇప్పుడు మరోసారి నోటీసులు జారీ చేసింది. పెద్దగా సమయం కూడా ఇవ్వకుండా.. రెండు రోజుల్లోనే తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించడం హాట్ టాపిక్ గా మారింది.
నిజానికి ఈ కేసులో కేటీఆర్ ను ఎప్పుడో అరెస్టు చేస్తారని అనుకున్నారు. కేటీఆర్ కూడా మెంటల్గా ప్రిపేరయ్యారు. కొన్ని సందర్భాల్లో పోలీసులు ఆయన ఇంటికి వస్తున్నారని క్యాడర్ ను కూడా సమీకరించారు. కానీ అరెస్టులు జరగలేదు. ఆ కేసు సైలెంట్ అయిపోయిది. అదో లొట్టపీసు కేసు అని కేటీఆర్ ఎగతాళి చేసేవారు. ఇప్పుడు ఆ కేసులో మరోసారి కదలిక ప్రారంభమయింది. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవడానికి గవర్నర్ అనుమతి కూడా లభించింది.
ఎన్నికలకు ముందు ఫార్ములా ఈ రేసు కంపెనీకి ఎలాంటి అనుమతులు లేకుండా యాభై కోట్లు బదిలీ చేశారు. అది నిబంధనలకు విరుద్ధమని కేసు నమోదు అయింది. తాము డబ్బులు పంపామని కేటీఆర్ అంటున్నారు. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా పంపడం నేరమని కేసులు పెట్టారు. ఈ కేసులో కేటీఆర్ ను అరెస్టు చేయడానికి అవకాశం ఉంది. కానీ వేడి పూర్తిగా తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు హఠాత్తుగా నోటీసులు జారీ చేసి ఏసీబీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.