అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మీడియాలో చాలా మంది ప్రకటనలు ఇచ్చారు. మిగతా వారి సంగతేమో కానీ ఇండోసోల్ అనే కంపెనీ మాత్రం మోత మోగించింది. ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చింది. ఆ ప్రకటనల్లోనే తమ కంపెనీ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు సబ్సిడరీ కంపెనీ అని చెప్పుకుంది.
షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అంటే జగన్ బినామీ సంస్థగానే ఎక్కువ మంది నమ్ముతారు. జగన్ హయాంలో ఆ సంస్థకు దోచిపెట్టిన భూములు, కాంట్రాక్టుల గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆ కంపెనీ ఐదేళ్లలో బహుముఖాలుగా విస్తరించి వేల కోట్ల పెట్టుబడులు పెడతామని వేల ఎకరాల భూములు తీసుకుంది. పెట్టుబడుల విషయంలో ఒప్పందాలు చేసుకుంది. పెట్టుబడులు పెడతామంటున్నారు కాబట్టి చూద్దామని.. ఏపీ ప్రభుత్వం కూడా అనుకుంటోంది. అవకాశం ఇవ్వకుండా రద్దు చేస్తే.. మళ్లీ పెట్టుబడుల్ని వెళ్లగొట్టారని అంటారు.
అయితే ఆ సంస్థ పలు చోట్ల పర్యావరణ నిబంధనల్ని తుంగలో అటవీ భూముల్లో అక్రమ నిర్మాణాలు చెపట్టిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఇటీవల అటవీ మంత్రి పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశించారు. విచారణ జరుగుతోంది. ఈ సమయంలో ఇండోసోల్ కంపెనీ.. ప్రభుత్వ పెద్దల్ని మెప్పించేందుకు పెద్ద ఎత్తున పేపర్ ప్రకటనల్ని ఇచ్చింది. శంకుస్థాపన జరిగిన రోజు మిగిలిన ప్రకటనల్లో తమది కలిసిపోయి పెద్దలు పట్టించుకోరని అనుకున్నారేమో కానీ..రెండో రోజు కూడా ఫుల్ పేజీ యాడ్ ఇచ్చారు. కృృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఈ కంపెనీ యాజమాన్యం జగన్ ను వదిలేసిందా లేకపోతే.. వచ్చినవన్నీ పోగొట్టుకోవడం ఎందుకని డబుల్ గేమ్ ఆడుతుందా అన్నదే చాలా మందికి అర్థం కావడం లేదు.