ముగ్గురు హీరోలు కలిసి చేసిన సినిమా `భైరవం`. బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ కలిసి ఒకే తెర పంచుకోవడం ఆసక్తిని రేకెత్తించింది. టీజర్, ట్రైలర్, పాటలూ.. ఇవన్నీ ఈ సినిమాపై అంచనాలు పెంచుకొంటూ వెళ్లాయి. ప్రమోషన్లు కూడా గట్టిగానే చేశారు. విడుదలకు ముందు కావల్సినంత బజ్ వచ్చింది. బిజినెస్కు ఇది బాగా హెల్ప్ అయ్యింది. జీ స్టూడియోస్ నాన్ థియేట్రికల్ రైట్స్ ని మంచి మొత్తానికి కొనుగోలు చేశారు. విడుదలకు ముందే నిర్మాత సేఫ్లోకి వెళ్లగలిగాడు.
తమిళ చిత్రం `గరుడన్`కి రీమేక్ ఇది. అయితే దర్శకుడు విజయ్ కనకమేడల తెలుగు నేటివిటీకి తగినట్టుగా మార్పులు చేర్పులు చేశారు. ఈ సినిమా చూస్తే రీమేక్ అనుకోరని, అంత కొత్తగా తీర్చిదిద్దారని టీమ్ చెబుతోంది. సెన్సార్ కాపీ చేతికి వచ్చాక టీమ్ మొత్తం సినిమా మరోసారి చూసుకొంది. వాళ్లంతా హ్యాపీ. ప్రీ రిలీజ్ ఫంక్షన్లా… ప్రీ సక్సెస్ మీట్ చేసేసుకొన్నారు. బెల్లంకొండతో సహా మిగిలిన హీరోలు కూడా ఈ సినిమాపై చాలా కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతున్నారు. ముగ్గురు హీరోలూ పోటాపోటీగా నటించారని, క్లైమాక్స్ లో ఎమోషన్స్ ఆకట్టుకొంటాయని దర్శకుడు చెబుతున్నారు. తెలుగు తెరపై ఓ మంచి మాస్ సినిమా వచ్చి చాలా రోజులైంది. అందుకే `భైరవం`పై దృష్టి పడింది. ఈ ముగ్గురు హీరోలూ కాస్త గ్యాప్ తరవాత చేసిన సినిమా ఇది. కాబట్టి.. వాళ్లకూ ఈ సినిమా ఫలితం చాలా ముఖ్యం.
బాక్సాఫీసు దగ్గర కూడా సరైన సినిమా లేదు. ఐపీఎల్ కూడా ముగింపు దశకు వచ్చేసింది. కాబట్టి… థియేటర్లకు ప్రేక్షకులు రావడానికి పెద్దగా అడ్డంకులు కూడా లేవు. మంచి టాక్ వస్తే, మౌత్ పబ్లిసిటీతో ఈ సినిమా మరింత దూసుకెళ్లడం ఖాయం.