అల్లరి నరేష్ త్వరలోనే కొత్త సినిమా మొదలుపెట్టబోతున్నాడు. ఈ సినిమాకు ‘రాధా’ ఫేమ్ చంద్రమోహన్ దర్శకుడు. ‘రంభ ఊర్వశి మేనక’ అనే పేరు ఖరారు చేశారు. ఈ సినిమాని రెండు బ్యానర్లు కలిసి తెరకెక్కించబోతున్నాయి. ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోంది.
`రంభ ఊర్వశి మేనక` అనేగానే ముగ్గురు హీరోయిన్లు, సోషియో ఫాంటసీ కథ.. అనే అనుకొంటాం. కానీ ఈసారి చంద్రమోహన్ కాస్త కొత్తగా, వింతగా ఆలోచించాడని టాక్. టైటిల్ వెనకే గమ్మత్తయిన కథ ఉందట. అదేమిటన్నది సినిమా చూస్తే గానీ అర్థం కాదు. ‘నాంది’, ‘ఉగ్రం’ లాంటి సినిమాలతో సీరియస్ కథల్ని టచ్ చేశాడు నరేష్. అయితే తనకు ఇప్పుడు కామెడీ మీద మమకారం పెరిగింది. మధ్యలో ‘ఆ ఒక్కటీ అడక్కు’ లాంటి సినిమా తీసినా ఫలితం రాలేదు. పూర్తి స్థాయి వినోదాత్మక సినిమా కోసం ఆయన అన్వేషణలో ఉన్నారు. సరిగ్గా చంద్రమోహన్ అలాంటి కథే చెప్పాడని తెలుస్తోంది. శర్వానంద్ తో తీసిన ‘రాధా’ వర్కవుట్ అవ్వలేదు. ఆ తరవాత దర్శకుడు చాలా గ్యాప్ తీసుకొని ఈ ప్రాజెక్ట్ తో వస్తున్నాడు. పూర్తి వివరాల కోసం మరి కొద్ది రోజులు ఆగాలి. ‘బచ్చల మల్లి’ తరవాత నరేష్ 12ఏ – రైల్వే కాలనీ అనే సినిమా చేశాడు. షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఆ తరవాత చేయబోయే సినిమా ఇదే కావొచ్చు.