వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసిన కేసులో సంచలన నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న సిట్ అనంతబాబు భార్య పాత్రపై సిట్ కీలక ఆధారాలను కోర్టుకు సమర్పించింది. అనుబంధ చార్జిషీటు దాఖలు చేసింది. సుబ్రహ్మణ్యం హత్య కేసులో కేవలం అనంతబాబు మాత్రమే కాకుండా, ఆయన భార్య కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు సిట్ అధికారులు చార్జిషీట్లో నివేదించారు. ఘటన జరిగిన రోజు రాత్రి అనంతబాబు నివసించే అపార్ట్మెంట్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీని విశ్లేషించిన అధికారులు, హత్య జరిగిన సమయంలో, మృతదేహాన్ని తరలించే క్రమంలో ఆమె అక్కడే ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు లభించిన దృశ్యాలను సిట్ బృందం పకడ్బందీ ఆధారాలుగా కోర్టుకు సమర్పించింది.
రూ. 20 వేల వివాదమే హత్యకు కారణం
సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటు ఆయన భార్య వద్ద డ్రైవర్ గా పని చేసేవారు. ఆయన హత్యకు గురి కావడానికి మూడు నెలల ముందు ఉద్యోగం మానేశారు. అయితే అంతకు ముందు యాభై వేల రూపాయల అప్పు తీసుకున్నారు. ఇంకా ఇరవై వేలు తిరిగి చెల్లించాల్సి ఉంది. అనంతబాబు పుట్టిన రోజున ఆ ఇరవై వేల కోసం.. అతడ్ని ఇంటి నుంచి తీసుకు వచ్చి హింసించారు. కొట్టి చంపేశారు. తర్వాత అనంతబాబు ప్రమాదం జరిగిందని ఇంట్లో వాళ్లకి చెప్పి డోర్ డెలివరీ చేశాడు. తన భార్యను కేసు నుంచి తప్పించడానికి తాను ఒక్కడినే చేశానని నేరం అంగీకరించాడు.
విచారణను నీరుగార్చే ప్రయత్నంపై సిట్ ఫోకస్
గత ప్రభుత్వ హయాంలో ఈ కేసును కేవలం అనంతబాబు ఒక్కడే చేసిన హత్యగా చూపి, విచారణను ముగించే ప్రయత్నం జరిగిందని సిట్ భావిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం, ఈ ఘటన వెనుక ఉన్న గన్ మెన్లు, అనంతబాబు కుటుంబ సభ్యుల పాత్రపై లోతుగా ఆరా తీసింది. ముఖ్యంగా మృతదేహాన్ని బాధితుడి ఇంటికి చేర్చే ప్రక్రియలో ఎవరెవరు సహకరించారు అనే దానిపై శాస్త్రీయ ఆధారాలను సేకరించింది.
పరారీలో అనంతబాబు భార్య లక్ష్మిదుర్గ
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సిట్ విచారణ వేగవంతం కావడం, తన ప్రమేయం కూడా బయటపడటంతో అనంతబాబు భార్య లక్ష్మిదుర్గ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. హత్య జరిగిన రాత్రి అపార్ట్మెంట్ వద్ద ఆమె ఉన్నట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా స్పష్టమైన ఆధారాలు లభించడంతో, విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. అయితే, పోలీసుల నుంచి నోటీసులు అందినప్పటి నుంచి ఆమె ఆచూకీ లభించకపోవడం కేసులో మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. సాక్ష్యాధారాల తారుమారు లేదా నిందితులకు సహకరించిన కోణంలో ఆమె పాత్రపై లోతుగా విచారించాల్సి ఉండటంతో, పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఒకవేళ ఆమె స్వచ్ఛందంగా విచారణకు హాజరుకాకపోతే, చట్టపరమైన తదుపరి చర్యలు తీసుకునేందుకు సిట్ సిద్ధమవుతోంది. కోర్టులో ఆమెకు ఇప్పటి వరకూ ఎలాంటి ఊరట లభించలేదు.
