ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి కానుకగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు , పోలీసు సిబ్బందికి భారీ ఊరటనిచ్చింది. గత ప్రభుత్వ హయాం నుంచి పెండింగ్లో ఉన్న డీఏ , డీఆర్ బకాయిలతో పాటు పోలీసుల సరెండర్ లీవుల నిధులు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ మొత్తం రూ. 2,653 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇందులో డీఏ, డీఆర్ ఎరియర్స్ కోసమే రూ. 1,100 కోట్లు కేటాయించగా, గత కొంతకాలంగా బిల్లులు అందక ఇబ్బంది పడుతున్న ఉద్యోగుల కళ్లల్లో ఇప్పుడు ఆనందం కనిపిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 2.25 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు, 2.70 లక్షల మంది పెన్షనర్లు , 55 వేల మంది పోలీసు సిబ్బందికి నేరుగా లబ్ధి చేకూరింది. పండుగపూట ఉదయమే వారి అకౌంట్లలో డబ్బులు జమ కావడంతో వారి ఆనందం వాట్సాప్ గ్రూపుల్లో వ్యక్తం చేశారు. సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు, పోలీసు సిబ్బందికి వారి సీనియారిటీని బట్టి ఒక్కొక్కరి అకౌంట్లో రూ. 70,000 నుండి రూ. 80,000 వరకు నగదు జమ అయ్యాయి. పండుగ పూట ఇంత పెద్ద మొత్తం చేతికి అందడంతో, గత ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న తమ బకాయిలు ఎట్టకేలకు చెల్లించారని ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
పోలీసు విభాగంలో పనిచేసే వారికి సరెండర్ లీవుల రూపంలో రూ. 110 కోట్లు విడుదల చేయడం విశేషం. విధి నిర్వహణలో నిరంతరం శ్రమించే పోలీసులకు, పండుగ ఖర్చుల సమయంలో ఈ నిధులు కొండంత అండగా నిలిచాయి. అలాగే పెన్షనర్లకు కూడా డీఆర్ బకాయిలు అందడంతో వారు కూడా ప్రభుత్వ నిర్ణయంపై సానుకూలంగా స్పందిస్తున్నారు. గతంలో బకాయిల కోసం రోడ్డెక్కిన పరిస్థితి నుంచి, ఇప్పుడు నేరుగా ఫోన్లకు మెసేజ్లు వస్తున్న తరుణం తమకు నిజమైన పండుగని ఉద్యోగులు ఆనందపడిపోతున్నారు.
ప్రభుత్వం కేవలం ఉద్యోగులకే కాకుండా, గతంలో పెండింగ్లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులను కూడా క్లియర్ చేయడం ద్వారా ఆర్థిక చక్రం మళ్ళీ వేగంగా తిరిగేలా చేసింది. సంక్రాంతి వేళ ఆర్థిక ఇబ్బందులు లేకుండా, కష్టపడిన ప్రతి పైసా ఖాతాలో పడటంతో ఉద్యోగ వర్గాల నుండి ప్రభుత్వానికి మద్దతు లభిస్తోంది. బకాయిలు వస్తాయో రావో అన్న సందిగ్ధంలో ఉన్న వేలాది కుటుంబాలకు ఈ నగదు బదిలీ పెద్ద భరోసాగా నిలిచింది.
