రాజమౌళి లాగానే అపజయం ఎరుగని ప్రయాణం చేస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి. `సంక్రాంతికి వస్తున్నాం`తో రూ.300 కోట్ల సినిమాని టాలీవుడ్ కి అందించారు. ప్రస్తుతం చిరంజీవితో ఓసినిమా చేస్తున్నారు. త్వరలోనే సెట్స్కి వెళ్తుంది. 2026 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ఆ తరవాత అనిల్ రావిపూడి ఎవరితో సినిమా చేస్తారన్న విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. చిరుతో సినిమా ముగిసిన వెంటనే ఆయన బాలకృష్ణతో జట్టు కట్టే అవకాశాలు ఉన్నాయి. బాలకృష్ణ – అనిల్ రావిపూడి కాంబోలో ‘భగవంత్ కేసరి’ సినిమా వచ్చింది. అది మంచి హిట్టు. ఇప్పుడు మరోసారి ఈ కాంబోని వెండి తెరపై చూడొచ్చు.
‘భగవంత్ కేసరి’లో బాలయ్య క్యారెక్టర్ చాలా సెటిల్డ్ గా ఉంటుంది. అప్పటి వరకూ బాలయ్యని దర్శకులు చూపించిన విధానం వేరు.. అనిల్ రావిపూడి చూపించిన పద్ధతి వేరు. ఆ వైవిధ్యమే `భగవంత్ కేసరి`ని నిలబెట్టింది. అనిల్ రావిపూడి సినిమాల్లో ‘భగవంత్ కేసరి’ డిఫరెంట్ జోనర్ కూడా. ఈసారి కూడా బాలయ్య కోసం అలాంటి కథే డిజైన్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం చిరు స్క్రిప్టులో తలమునకలై ఉన్నారు రావిపూడి. 2026 సంక్రాంతి తరవాతే.. బాలయ్య సినిమాపై పూర్తిగా ఫోకస్ చేస్తారు. ‘ఎఫ్ 4’ చేయాలన్న ఆలోచన కూడా ఉంది. అయితే అది ఇప్పట్లో కుదరకపోవొచ్చు.